
సిడ్నీ: వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్టులో భారీ విజయం సాధించింది. 416 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన కివీస్ 136 పరుగులకే ఆలౌట్ అవడంతో.. ఆసీస్ 279 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, పాట్ కమ్మిన్స్ ఒక వికెట్ తీసారు. ఆసీస్ ఆల్రౌండర్ కోలిన్ డి గ్రాండ్హోమ్ (52) ఒక్కడే కాసేపు పోరాడాడు.
ఓవర్నైట్ స్కోరు 40/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 217 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (111) అజేయ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ జో బర్న్స్ (40), మార్నస్ లబుషేన్ (59) రాణించారు. ఇక 416 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన కివీస్ 136 పరుగులకే ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్క్ పదునైన బంతులతో ఓపెనర్లు టామ్ లాతమ్ (1), టామ్ బ్లండెల్ (2)లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం జట్టు స్కోర్ 22 వద్ద జీత్ రావల్ (12)ను లయన్.. గ్లెన్ ఫిలిప్స్ (0)ను కమ్మిన్స్ ఔట్ చేసారు. మరోకొద్ది సేపటికే రాస్ టేలర్ (22) కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ ఓటమి దిశగా సాగింది. అయితే వాట్లింగ్ (19) అండతో గ్రాండ్హోమ్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.
ఈ సమయంలో లయన్ వరుసగా గ్రాండ్హోమ్, టాడ్ ఆస్టెల్ (17) లను పెవిలియన్ చేర్చి మరింత కష్టాల్లోకి నెట్టాడు. చివరగా వాట్లింగ్ వెనుదిరగడంతో కివీస్ కథ ముగిసింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లబుషేన్ (215, 59)కు దక్కింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 454 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. రెండో ఇన్నింగ్స్ 217/2 వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 256 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ 136 ఆలౌట్ అయింది. తొలి రెండు టెస్టుల్లో కూడా ఆసీస్ భారీ విజయాల్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.