
హైదరాబాద్: అడిలైడ్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 235 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 15 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 191/7 ఓవర్నైట్ స్కోర్తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 44 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.
దీంతో అంఫైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. మూడో రోజు ఆటలో భాగంగా తొలి వికెట్ మిచెల్ స్టార్క్(15) బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. 91.4 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మిచెల్ స్టార్క్(15; 34బంతుల్లో) పంత్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. దీంతో కొంత సమయం ఆట నిలిచిపోయింది. మళ్లీ ఆట మొదలు కాగానే, షమీ మిగతా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యాండ్స్ కాంబ్ (34), కవాజా (28) పరుగులతో ఫరవాలేదనిపించారు.
భారత బౌలర్లలో బుమ్రా, ఆశ్విన్లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శర్మ, షమీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ భారత్ 250 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.