
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియాకు శుభవార్త. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్ ప్రారంభ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ 2020 సమయంలో కండరాల గాయం బారిన పడిన ఇషాంత్ను టెస్టు సిరీస్కు ఎంపిక చేయలేదు. ఈ గాయం కారణంగానే ఇషాంత్ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే ఆడి.. టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం పెద్దది కావడంతో టెస్టు జట్టుకు అతణ్ని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఇషాంత్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావస కేంద్రంలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది.
ఎన్సీఏలో భారత మాజీ పేసర్ పరాస్ మాంబ్రేతో కలిసి ఇషాంత్ శర్మ ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇషాంత్ ఫిట్నెస్ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడని ఏఎన్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 'టెస్టు సిరీస్ ప్రారంభమయ్యేలోగా ఫిట్నెస్ సాధించేలా మాంబ్రేతో కలిసి ఇషాంత్ పని చేస్తున్నాడని ద్రవిడ్ బీసీసీఐ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇషాంత్ కీలక పాత్ర పోషిస్తాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీ వేళ అతడి అనుభవం జట్టుకు పనికొస్తుంది' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రంజీ ట్రోఫీలో కాలి మడమ గాయానికి గురైన ఇషాంత్ శర్మ.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు మిస్సయ్యాడు. టెస్టు సిరీస్ ప్రారంభంలోగా అతడు కోలుకున్నప్పటికీ.. రెండో టెస్టులో అదే సమస్య కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ టెస్ట్ సిరీస్ భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక మరో మూడు టెస్టులు ఆడితే ఇషాంత్ వంద టెస్టులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం అతడు 97 టెస్టులు ఆడాడు.
భారత్ తరఫున 97 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 297 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్లు 11 సార్లు, 4 వికెట్లు 10 సార్లు పడగొట్టాడు. ఇక 80 వన్డేలు, 14 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఇషాంత్.. 115, 8 వికెట్లు తీశాడు. 2016 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. డిసెంబర్ 17న భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇషాంత్ ఫిట్నెస్ నిరూపించుకుంటే.. రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లనున్నాడు.