

హైదరాబాద్: ఆసీస్తో జరిగిన మూడో టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల వెస్టిండిస్తో ముగిసిన టీ20 సిరీస్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ధారాళంగా పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో మూడు టీ20ల సిరిస్లో కృనాల్ పాండ్యా ఎంపికపై మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం తీవ్ర విమర్శలు చేశారు. పాండ్యా స్థానంలో యజువేంద్ర చాహాల్కు చోటు కల్పించాలని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ బాహాటంగానే విమర్శించాడు. అయితే ఆ తర్వాతి నుంచి జోరందుకున్న కృనాల్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.
సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాండ్యా ప్రదర్శనపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "గత మ్యాచ్ల్లో తన తప్పులను వెంటనే అధిగమించి ఈ ఆల్రౌండర్.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు" అని అన్నాడు. మూడో టీ20లో చక్కటి బంతులు విసిరి బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించాడని అన్నాడు.
మరోవైపు ఎడమ చేతి వాటం బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా ఈ సిరీస్లో అద్భుతంగా రాణించాడని లక్ష్మణ్ కితాబిచ్చాడు. "చక్కటి స్వింగ్ బౌలింగ్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యాడు. తర్వాతి మ్యాచ్ల్లోనూ అతను ఇదే జోరు కొనసాగిస్తే భారత పేస్ బౌలింగ్ దళంలో అతను కీలకం కాగలడు" అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
మూడు టీ20ల సిరిస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించగా... ఆఖరి టీ20లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరిస్ 1-1తో సమం అయింది.