పుజారా సెంచరీ కోసం తీసుకున్న బంతుల సంఖ్య
280 - తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించేందుకు పుజారా తీసుకున్న బంతుల సంఖ్య. తన సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో పుజారా తొలిసారి సెంచరీ సాధించేందుకు ఇన్ని బంతులను తీసుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో పుజారా సాధించిన సెంచరీ భారత్ తరుపున గత 15 ఏళ్లలో టెస్టుల్లో అత్యంత నిదానమైన రెండో సెంచరీ కావడం విశేషం. 2012లో నాగ్ పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసేందుకు గాను 289 బంతులను తీసుకున్నాడు.
టీమిండియా రన్ రేట్
2.61 - తొలి ఇన్నింగ్స్లో టీమిండియా రన్ రేట్. గత 20 ఏళ్లలో 150 ఓవర్లు ఆడిన ఇన్నింగ్స్లో ఇదే అతి తక్కువ రన్ రేట్. 2003లో మొహాలీ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 172 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 424 పరుగులు చేసింది. దీంతో రన్ రేట్ 2.46గా నమోదైంది.
రెండో అతి తక్కువ స్కోరు
443/7 - 1996 నుంచి టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా డిక్లేర్డ్ చేసిన రెండో అతి తక్కువ స్కోరు ఇదే. 2007లో చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో వర్షం కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 387/8 వద్ద డిక్లేర్ చేసింది.
ద్రవిడ్ రికార్డు బద్దలు
1138 - ఈ ఏడాది టెస్టుల్లో భారత్ వెలుపల విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. దీంతో మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్(1137-2002) రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లీ కంటే ముందు గ్రేమ్ స్మిత్(1212-2008), వివ్ రిచర్డ్స్(1154-1976) ఈ జాబితాలో ఉన్నారు.
బాక్సింగ్ డే టెస్టులో ఒకే ఒక్కడు కోహ్లీ
1 - మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీకి పైగా పరుగులు సాధించిన పర్యాటక బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. 2014లో జరిగిన టెస్టులో కోహ్లీ వరుసగా 169, 54 పరుగులు సాధించాడు.
ఆరో భారత బ్యాట్స్మన్గా రోహిత్
1032 - టెస్టుల్లో ఆరో నెంబర్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి వెయ్యికిపైగా పరుగులు సాధించిన ఆరో భారత బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.