
హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. యాషెస్ సిరిస్లో భాగంగా జరుగుతున్న ఈ రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లు ఆండర్సన్, క్రిస్ వోగ్స్ అద్భుత ప్రదర్శన చేశారు.
అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ డే అండ్ నైట్ టెస్టులో వీరిద్దరూ 9 వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్లో 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ జట్టుకు ఆస్ట్రేలియా 353 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో ఆండర్సన్ 5 వికెట్లు తీసి తన కెరీర్లో మరో అద్భుత ప్రదర్శన చేశాడు. అడిలైడ్ ఓవల్ స్టేడియం చరిత్రలోనే టెస్టు మ్యాచ్ చూసేందుకు రికార్డు స్థాయిలో హాజరైన ప్రేక్షకుల మధ్య అండర్సన్ ఆస్ట్రేలియాలో తొలిసారి ఐదు వికెట్లు తీయడం విశేషం. అండర్సన్ టెస్టుల్లో ఐదు వికెట్ల సాధించడం ఇది 25వసారి.
అనంతరం 353 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కూడా దీటుగా బదులిస్తున్నారు. ప్రస్తుతం 56 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఇంగ్లాండ్ను విజయం వరించే అవకాశాలు ఉన్నాయి.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 442 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 227 పరుగులకే కుప్పకూలింది. నాథన్ లియాన్ 4 వికెట్లు, స్టార్క్ 3 వికెట్ల తీశారు. మరోవైపు అడిలైడ్ ఓవల్ స్టేడియం చరిత్రలోనే టెస్టు మ్యాచ్ చూసేందుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు.