సిడ్నీ: భద్రతా కారణాల రీత్యా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఉభయ దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటన ఈ నెలాఖరున ప్రారంభం కావాల్సి ఉంది. పాకిస్తాన్ లో చెలరేగిన హింస కారణంగా ఆ పర్యటనను వాయిదా చేశారు. పర్యటన సకాలంలో జరగనందుకు విచారంగా ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ అన్నారు.
పర్యటన వాయిదా వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏ విధమైన నష్టం వాటిల్లకూడదని తాము కోరుకుంటున్నామని, ఈ పర్యటన సమీప భవిష్యత్తులో ఉంటుందని ఆయన అన్నారు. పర్యటన తేదీలను ఖరారు చేయడానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వచ్చే వారం దుబాయ్ లో సమావేశమవుతాయి. తటస్థ వేదికలపై సిరీస్ ను ఆడడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరిస్తోంది. మ్యాచ్ వేదికలను తగ్గించి, విశేష భద్రత మధ్య ఆస్ట్రేలియా పర్యటన కొనసాగాలని పాకిస్తాన్ వాంఛిస్తోంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా సిరీస్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభమవుతుందని తాము ఆశిస్తున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నసీమ్ అష్రాఫ్ అన్నారు. 1998 నుంచి ఆస్ట్రేలియా పాకిస్తాన్ లో టెస్టు మ్యాచులు ఆడలేదు.