హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఈ నెల 23న జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్కు 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ మొదటి రెండు టెస్టులకు భారత జట్టుని ఎంపిక చేసింది.
బంగ్లాదేశ్తో ఆడిన జట్టునే ఆస్ట్రేలియా సిరీస్తో జరిగనున్న మొదటి రెండు టెస్టులకు కొనసాగించింది. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు కరుణ్ నాయర్ను తిరిగి జట్టులో్కి ఎంపిక చేయగా, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్లకు చోటు కల్పించారు. ఇంగ్లాండ్ సిరిస్లో ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ్ నాయర్పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు అతని ఎంపికపై మరోసారి మొగ్గు చూపారు.
ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్తో టెస్టుకు కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్లను ఎంపిక చేసినా, తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐదున్నరేళ్ల క్రితం భారత్ తరఫున తన చివరి టెస్టు ఆడిన తమిళనాడు బ్యాట్స్మన్ ముకుంద్కు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు లభించింది.
మరోవైపు కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరిస్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు 19 టెస్టుల్లో తన విజయ పరంపరను కొనసాగించింది. దీంతో పాటు వరుసగా ఆరు టెస్టు సిరిస్లను కోహ్లీ సేన సొంతం చేసుకుంది.
ప్రస్తుత హోం సీజన్లో ఆడుతున్న టీమిండియాకు ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరిస్ చివరి టెస్టు సిరిస్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు హోం సీజన్లో 9 టెస్టు లాడిన టీమిండియా అందులో 8 టెస్టుల్లో విజయం సాధించి, ఒక దానిని డ్రాగా (రాజ్ కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు డ్రా) ముగించింది.
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు సోమవారం భారత్కు చేరుకుంది. సిరిస్ ప్రారంభానికి ఇంకా పది రోజుల సమయం ఉండగానే స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ముంబైలో అడుగుపెట్టింది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా జట్టు దుబాయిలోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.
ఆస్ట్రేలియా జట్టు బుధవారం నుంచి ముంబైలో ప్రాక్టీస్ చేయనుంది. నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఫిబ్రవరి 23న పూణెలో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు 17-19 తేదీల్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత్ ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
తొలి రెండు టెస్టులకు టీమిండియా:
జట్ల వివరాలు:
టీమిండియా: 1. విరాట్ కోహ్లీ (కెప్టెన్), 2. మురళీ విజయ్, 3. కేఎల్. రాహుల్, 4. ఛటేశ్వర్ పుజారా, 5. అజింక్య రహానె, 6. కరుణ్ నాయర్, 7. వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), 8. రవిచంద్రన్ అశ్విన్, 9. రవీంద్ర జడేజా, 10. జయంత్ యాదవ్, 11. ఉమేష్ యాదవ్, 12. ఇషాంత్ శర్మ, 13. భువనేశ్వర్ కుమార్, 14. కుల్దీప్ యాదవ్, 15. అభినవ్ ముకుంద్, 16. హార్ధిక్ పాండ్య.
ఆస్ట్రేలియా జట్టు: 1. స్టీవ్ స్మిత్ (కెప్టెన్), 2. డేవిడ్ వార్నర్, 3. మాథ్యూ రెన్షా, 4. షాన్ మార్ష్, 5. పీటర్, 6. మిచెల్ మార్ష్, 7. మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), 8. స్టీవ్ ఓ, 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియాన్, 11. జోష్ హాజిల్ ఉడ్, 12. అష్టన్ అగర్, 13. ఉస్మాన్ ఖవాజా, 14. జాక్సన్ బర్డ్, 15. మిచెల్ స్వీప్ సెన్, 16. గ్లెన్ మాక్సెవెల్