
ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ టీం శ్రీలంకకు ఆర్థిక సాయాన్ని అందించింది. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకలోని పేద చిన్నారుల ఆకలి తీర్చడానికి యూనిసెఫ్ హితోధికంగా సాయం అందిస్తోంది. శ్రీలంకలోని చిన్నారుల సహాయార్థం యూనిసెఫ్కు ఆస్ట్రేలియా టీం పెద్ద మొత్తంలో విరాళాన్ని అందింది. ఇటీవలే శ్రీలంకలో ఆస్ట్రేలియా మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్లు ఆడిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఆడుతున్న టైంలో పరిస్థితి లంకలో మరీ అధ్వానంగా ఉంది. అయినప్పటికీ లంక బోర్డు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సిరీస్లను విజయవంతంగా ముగించింది.
మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తీవ్ర సంక్షోభం నడుమ ఆసీస్ సిరీస్లు లంక ప్రజలకు ఉపశమనంగా నిలిచాయి. లంకలో ఆసీస్ క్రికెటర్లకు కూడా మంచి అభిమానం దక్కింది. గడ్డు పరిస్థితుల్లో లంకలో పర్యటించి తమను అలరించిన ఆసీస్ టీం పట్ల లంకేయులు విధేయత చాటుకున్నారు. ఇక లంక ప్రజల క్రికెట్ స్ఫూర్తిని ఆసీస్ ప్లేయర్లు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో లంక పర్యటనలో భాగంగా ఆసీస్ ప్లేయర్లకు వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా లంక చిన్నారులకు అందించాలని టీం మొత్తం డిసైడ్ అయి ఆ పని చేసింది.
ఆస్ట్రేలియాలో యూనిసెఫ్కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్. అందువల్ల ఈ మంచి పనికి అడుగులు పడ్డాయి. ఆస్ట్రేలియాలో టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ప్లేయర్లకు మొత్తంగా 45వేల ఆస్ట్రేలియా డాలర్లు (ఇండియా కరెన్సీలో రూ.25లక్షలు శ్రీలంక కరెన్సీలో ఒక కోటి పదహారు లక్షలు) రాగా ఆ మొత్తాన్ని యూనిసెఫ్కు టీం అందజేసింది.
ఈ విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. 'శ్రీలంకలో ప్రజలు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో స్వయంగా చూశాం. మాకొచ్చే ప్రైజ్ మనీతో అక్కడ ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు కొద్దో గొప్పో మా తరఫున సాయం చేయాలనుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం'అని కమిన్స్ చెప్పాడు. లంక పర్యటనలో ఆసీస్ మూడు మ్యాచుల టీ20 సిరీస్ 2-1 తేడాతో గెలుపొందగా.. వన్డే సిరీస్లో ఓడిపోయింది. టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది.