
హైదరాబాద్: టెస్టు క్రికెట్కు ఆదరణ తెచ్చేందుకు ఐసీసీ గతేడాది నుంచి టెస్టు ఛాంపియన్షిప్ పేరిట కొత్త ఛాంపియన్షిప్ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ టెస్టు ఛాంపియన్షిప్ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది.
సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలింతగా 120 పాయింట్లు ఆస్ట్రేలియా ఖాతాలో చేరడంతో పాయింట్ల పట్టికలో అనూహ్యంగా రెండో స్థానానికి ఎగబాకింది.
అంతకముందు పాకిస్థాన్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను సైతం 2-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను 2-2తో సమం చేయడం ద్వారా 56 పాయింట్లు సాధించిన ఆసీస్... పాక్తో రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో 120 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది.
మరోవైపు టెస్టు క్రికెట్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత క్రికెట్ జట్టు ఆడిన మూడు సిరీస్ల్లో గెలుపొంది 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియానే ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు చెరో రెండు టెస్టు సిరీస్ల్లో తలపడిన పాకిస్థాన్, శ్రీలంక 80 పాయింట్లతో మూడు, నాలుగు ర్యాంకులతో ఉన్నారు. న్యూజిలాండ్(60 పాయింట్లు), ఇంగ్లాండ్(56 పాయింట్లు) ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయానికి వస్తే మొత్తం రెండేళ్లపాటు జరిగే ఈ లీగ్లో మూడు స్వదేశీ సిరీస్లు, మూడు విదేశీ సిరీస్లుగా నిర్వహిస్తున్నారు.
ఇందులో పాల్గొనే మొత్తం తొమ్మిది జట్ల మధ్య 27 ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించనున్న ఐసీసీ చివరకు ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతను నిర్ణయిస్తుంది. ఈ సిరీస్ల్లో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి రెండు జట్లు ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా 2021 జూన్లో జరిగే ఫైనల్లో తలపడతాయి.
ఇరు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్తో సంబంధం లేకుండా 120 పాయింట్లు చొప్పున ఐసీసీ కేటాయించింది. దీంతో ఒక్కో జట్టుకు అత్యధికంగా 720 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తుంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ vs ఆస్ట్రేలియా తలపడే సూచనలు కనిపిస్తున్నాయి.