మరికొన్ని రోజుల్లో టెస్టు కిరీటం కోసం ఆస్ట్రేలియా, భారత్ తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ను ఎదుర్కోవడం కష్టమైన పనే అని ఆసీస్ స్టార్ స్టీవెన్ స్మిత్ అంటున్నాడు. ఓవల్ పిచ్ బ్యాటింగ్కు బాగా సహకరిస్తుందని.. అదే సమయంలో మంచి పేస్, బౌన్స్ కూడా ఇస్తుందని చెప్పాడు.
అదే సమయంలో అప్పుడప్పుడూ ఇక్కడ స్పిన్నర్లు కూడా చెలరేగుతారని స్మిత్ అన్నాడు. 'మ్యాచ్ గడిచే కొద్దీ ఓవల్లో కొంత స్పిన్ లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా భారత్లో మేం ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కోవాల్సి రావచ్చు. మ్యాచ్ జరుగుతున్న ఏదో ఒక సమయంలో ఆ ఫీలింగ్ తప్పకుండా వస్తుంది' అని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో క్రికెట్ ఆడేందుకు ఇది అద్భుతమైన స్టేడియం అని కూడా తెలిపాడు.

'ఇక్కడ అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. ఓవల్లో బ్యాటింగ్ చేస్తుంటే ఆ మజానే వేరు. చక్కని పేస్, బౌన్స్ను ఎదుర్కొంటూ ఆడొచ్చు. మ్యాచ్ అయితే అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నా' అని స్టీవ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు భారత్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. స్మిత్ కెప్టెన్సీలో మూడో టెస్టులో భారత్ను కంగారూలు ఓడించగలిగారు.
'డబ్ల్యూటీసీ చాలా మంచి ఆలోచన. మేం ఆడే ప్రతి మ్యాచ్కు దీని వల్ల ఒక మంచి కారణం కనిపిస్తోంది. ఈ టోర్నీలో మేం క్వాలిఫై అవడంతోపాటు ఫైనల్లో భారత్ను ఎదుర్కోబోతున్నాం. ఇది చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. ఓవల్లో చాలా మంది ప్రేక్షకులు వస్తారని అనుకుంటున్నా. ఎక్కువ మంది టీమిండియా ఫ్యాన్సే వస్తారు. కానీ మ్యాచ్ మాత్రం సూపర్గా ఉండబోతోంది. మా కుర్రాళ్లంతా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు' అని చెప్పాడు.