
ఇటీవల స్వదేశంలో సఫారీలను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా జట్టు.. తమ తర్వాతి టార్గెట్ కోసం రెడీ అవుతోంది. భారత్ను స్వదేశంలో ఎదుర్కోవడం కష్టమని, దీని కోసం తాము సరిగ్గా సిద్ధం అయ్యే వస్తామని ఇప్పటికే హెచ్చరికలు కూడా చేసిందా జట్టు. ఈ క్రమంలోనే తాజాగా భారత పర్యటనలో పాల్గొనే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మొత్తం 18 మంది బృందాన్ని ప్రకటించింది. వీరిలో యువ ఆటగాడు, ఆ జట్టు రైజింగ్ స్టార్ టాడ్ మర్ఫీకి కూడా చోటు దక్కడం గమనార్హం.
గతేడాదికి ముందు కేవలం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే ఆడిన మర్ఫీ.. 2022లో అద్భుతమైన ప్రదర్శనతో జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. విక్టోరియా, ఆస్ట్రేలియా ఎ, ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్ల తరఫున అతను అద్భుతంగా రాణించాడు. మార్ష్ షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో అతి తక్కువ యావరేజితో 14 వికెట్లు పడగొట్టాడీ 22 ఏళ్ల కుర్రాడు. దానికితోడు భారత్లో స్పిన్ పిచ్ల కోసం సిద్దం అవుతున్న ఆసీస్ జట్టు.. నాథన్ లియాన్కు జోడీగా మంచి స్పిన్నర్ కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే లియాన్, మిచెల్ స్వెప్సన్, ఆష్టన్ అగర్లను భారత పర్యటనకు సీఎ ఎంపిక చేసింది. అలాగే సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత పీటర్ హాండ్స్కోంబ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అతను చివరగా ఆస్ట్రేలియా తరఫున 2019లో ఆడాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. స్పిన్ను సమర్దవంతంగా ఎదుర్కొనే అతను ఇటీవలి కాలంలో దేశవాళీల్లో రాణించడంతో అతనికి మళ్లీ జట్టులో అవకాశం లభించింది. భారత్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతను కీలకంగా మారతాడని సీఏ భావిస్తోంది. భారత పర్యటనలో తొలి టెస్టుకు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కావడం ఆ జట్టుకు గట్టి షాక్ అనే చెప్పాలి.

ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హాండ్స్కోంబ్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.