
యాషెస్ సిరీస్లో భాగంగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో పర్యాటక ఇంగ్లండ్ ముందు అతిథ్య జట్టు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఏకంగా 468 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్ ఓడి సిరీస్లో వెనుకబడిన ఇంగ్లండ్కు ఈ టార్గెట్ను చేధించడం కత్తి మీద సామే. కాగా రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తమ స్కోర్ను 9 వికెట్ల నష్టానికి 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లోని 237 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా 467 పరుగుల భారీ అధిక్యంలో నిలిచింది.
దీంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే 468 పరుగులు చేయాల్సిందే. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో లాబుస్చాగ్నే, హెడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్, మలాన్, రాబిన్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రాడ్, అండర్సన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 473 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 236 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.
యాషెస్ సిరీస్లో కరోనా కలకలం
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన కారణంగా రెండో టెస్టు మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్కు పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అడిలైడ్ మైదాన అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్కు పంపించి, గ్రౌండ్ మొత్తం శానిటైజ్ చేసినట్టు తెలిపారు. అలాగే సదరు బాధితుడు ఎవరి ఎవరితో సన్నిహితంగా ఉన్నాడో విచారణ చేసి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వారు చెప్పారు. అయితే ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్కు ఎలాంటి ఇబ్బంది లేదని, మ్యాచ్ యథావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

రూట్గా గాయం
ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్లో ఓటమికి తోడు, రెండో టెస్టు మ్యాచ్లో భారీ టార్గెట్ చేధించాల్సిన క్రమంలో ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ జో రూట్ గాయం కారణంగా నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్కు రాలేదు. ప్రాక్టీసు సెషన్లో రూట్ గాయపడ్డట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. బంతి అతని పొత్తి కడుపులో బలంగా తగలడంతో ఇబ్బంది పడ్డాడని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. దీంతో రూట్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగేది అనుమానంగా మారింది.