హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరిస్ చేజారడానికి టీమిండియా అతి ప్రయోగాలే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరోక్షంగా చురకలు అంటించాడు. ఈ సిరిస్ గెలిచిన తర్వాత టీమ్లో ప్రయోగాలు చేసుంటే బాగుండేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2019: చెన్నై జట్టుకు యోయో టెస్టు లేదు, మరి ఫిట్నెస్!
గంగూలీ మాట్లాడుతూ "వన్డే సిరీస్లో భారత్ కంటే ఆస్ట్రేలియా జట్టు మెరుగ్గా ఆడింది. ఇందులో సందేహం లేదు. ఈ ఆస్ట్రేలియా జట్టే ప్రపంచకప్లోనూ గట్టి ప్రత్యర్థిగా నిలవనుంది. కాబట్టి.. ప్రపంచకప్ ముందు భారత్కి ఒకరకంగా ఈ సిరీస్ ఓటమి ఓ మేలుకొల్పు. సిరీస్లో టీమిండియా మరీ ఎక్కువగా ప్రయోగాలు చేసింది. అయినప్పటికీ.. ప్రపంచకప్కి ఇంకా చాలా సమయం ఉంది" అని అన్నాడు.
ఐదు వన్డేల సిరీస్లో తొలి రెండు వన్డేల్లోనూ గెలిచిన భారత్ జట్టు.. మూడో వన్డే నుంచే బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేపట్టి హ్యాట్రిక్ ఓటముల్ని చవిచూసింది. చివరి రెండు వన్డేల్లో ధోనీకి విశ్రాంతినిచ్చిన భారత్ జట్టు.. రిషబ్ పంత్ను ఆడించింది. అలానే అంబటి రాయుడిపై వేటు వేసి ఒక వన్డేలో కేఎల్ రాహుల్ని ఆడించింది.
ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో కేఎల్ రాహుల్పై వేటు వేసి... అదనపు బౌలర్తో బరిలోకి దిగింది. దీంతో వరుసగా హ్యాట్రిక్ ఓటములతో సిరీస్ను 2-3తో చేజార్చుకుంది. మే30న ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.