
సిడ్నీ: సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కడానికి, మెరుపు అవ్వడానికి బౌలర్లు లాలాజలం (ఉమ్మి)ను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇది క్రికెట్లో సాధారణంగా చూసే దృశ్యమే. కానీ ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి కారకాల్లో ఉమ్మి కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మున్ముందు మ్యాచ్లలో బౌలర్లు ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చనీయాంశమైంది.
ప్రస్తుత కరోనా కాలంలో ఒకరు ఉమ్మిన చోట మరో ఆటగాడు పట్టుకోవడం అంత ఆరోగ్యకరమేనా? ఇదే ఆలోచన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి వచ్చినట్టుంది. అందుకే బంతిని షైన్ చేసేందుకు ఆటగాళ్లు చెమట, ఉమ్మును వాడడాన్ని నిషేధించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి క్రికెట్ పున:ప్రారంభమైనప్పటి నుంచి ఈ నిబంధన వర్తించస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యలో ఐసీసీ కూడా దీని గురించి ఆలోచిస్తోంది. బంతిని షైన్ చేసేందుకు ఉమ్ము, చెమటకు బదులుగా ఏదైనా కృత్రిమ ద్రావణాన్ని వినియోగించడంపై యోచిస్తోంది. అయితే దీని వినియోగం పూర్తిగా అంపైర్ల పర్యవేక్షణలో జరిగేలా చర్యలు తీసుకోనుంది. దీంతో పాటు సీఏ.. లెవల్-ఏ, లెవల్-బి, లెవల్-సి అని మూడు విధానాలను ప్రవేశపెట్టింది.
కరోనా వైరస్తో టెస్టు క్రికెట్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ వాహకాలుగా ఉపయోగపడే ఉమ్మిని వాడే విషయంలో తాజా, మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సలైవా లేకుండా బంతి షైన్ చేయడం ఎలా అంటే.. మరికొందరు ప్రత్యామ్నాయం చూడాలని అంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి బంతిపై ఉమ్మితే మ్యాచ్ల్లో ఉన్న ఆటగాళ్లందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కొవిడ్-19 నుంచి బయటపడేలోపు.. బంతి పాలిష్ చేసే విషయంలో ఉమ్మి, చెమటను వాడాలా వద్దా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఐసీసీ త్వరలో తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మరోవైపు బాల్ ట్యాంపరింగ్ను అధికారికం చేస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. అప్పుడు ఐసీసీ నిర్దేశించిన పద్ధతుల ద్వారా అంపైర్ల సమక్షంలో బంతిని పాలిష్ చేసే అవకాశముంటుంది. అయితే దీని కోసం ఐసీసీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని టాంపరింగ్కు వాడేలా ఎంపిక చేయాలని చూస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్జీ, కూకాబుర్రా, డ్యూక్స్ అన్నింటిపై దీని ప్రభావం కనిపించేలా ఉండాలనేది కీలకంగా మారబోతున్నది.