దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా మరికొద్ది గంటల్లో మరో ఆసక్తిపోరుకు తెరలేవనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచులలో విజయాలు అందుకుని రెండో విజయంపై కన్నేశాయి. ఆస్ట్రేలియా తమ ఓపెనింగ్ మ్యాచులో దక్షిణాఫ్రికాను 5 వికెట్లతో ఓడించగా.. బంగ్లాదేశ్ టైగర్స్పై లంక అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచులో ఆసీస్ ఫెవరెట్గా కనిపిస్తున్నా.. లంకను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఇటీవలి కాలంలో లంక టీ20ల్లో అద్భుతంగా ఆడుతోంది.
Marcus Stoinis: ఎంఎస్ ధోనీ కాంప్లిమెంట్ ఇచ్చాడో.. తక్కువచేసి మాట్లాడాడో అర్ధం కాలేదు: స్టోయినిస్
శ్రీలంక తమ మ్యాచులో అద్భుతంగా ఆడింది. బ్యాటర్లు, బౌలర్లు చెలరేగి ఆడి బంగ్లాదేశ్ జట్టుని చిత్తు చేశారు. శ్రీలంకలో చరిత్ అసలంక, భానుక రాజపక్స సూపర్ ఫామ్లో ఉన్నారు. బంగ్లాపై చరిత్ 49 బంతుల్లో 80 పరుగులు చేయగా.. రాజపక్స 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అయితే మరో ఓపెనర్ కుశాల్ పెరీరా ఫామ్ శ్రీలంక జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. పెరీరాతో పాటు పాతుమ్ నిస్సాంక, కెప్టెన్ దసున్ శనక, అవిష్క ఫెర్నాండో రాణించాల్సిన అవసరం ఉంది. వీరందరూ గాడిలో పడితే.. లంక భారీ స్కోర్ చేయగలడు.
మరోవైపు శ్రీలంక బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా లంక జట్టు స్పిన్ విభాగం విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తోంది. స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా, మహేశ్ తీక్షణ తమ మ్యాజిక్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెడుతున్నారు. మహేశ్ తీక్షణ ఫిట్గా ఉంటే బినురా ఫెర్నాండో స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చే అవకాశం ఉంది. లహిరు కుమార కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పేస్ విభాగంలో చమిక కరుణరత్నే, దుష్మంత చమీరా కీలకం కానున్నారు. స్పిన్ బౌలింగ్ సరిగా ఆడని ఆసీస్ బ్యాటర్లు హసరంగా ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఇప్పటివరకు ముఖాముఖీ పోరులో 16 టీ20 మ్యాచ్లు ఆడగా.. చెరో ఎనిమిదిసార్లు విజయాలు సాధించాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు మూడు మ్యాచులు ఆడగా.. ఆస్ట్రేలియా 2, శ్రీలంక 1 మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో అభిమానులు ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఈ మ్యాచ్ జరిగే దుబాయ్లోని పిచ్లో బ్యాటర్లు ప్రారంభంలో ఓపికగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ పిచ్పై స్పిన్నర్లకు కూడా కొంత సహకారం అందుతుంది. టోర్నీలో ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకొనుంది.
శ్రీలంక తుది జట్టు (అంచనా):
కుశాల్ పెరెరా (కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో/మహీష్ తీక్షణ.