బెంగుళూర్: ఆస్ట్రేలియా భారత్ పై జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో తడబడుతూ ఆడుతున్నప్పటికీ పైచేయిగానే ఉంది. హర్భజన్, ఇషాంత్ చెరో రెండు వికెట్లు, జహీర్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్సులో ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో భారత్ పై 263 పరుగుల ఆధిక్యతను సాధించింది. షేన్ వాట్స్ 32 పరుగులతో, బ్రాడ్ హడీన్ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆరో వికెట్ కు వారిద్దరు అజేయంగా 65 పరుగులు జోడించారు. మరోసారి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ విఫలమైంది. మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్ చాలా త్వరగా అవుటయ్యారు. సైమన్ కాటిచ్ రెండున్నర గంటలు వికెట్ల వద్ద ఉండి 140 బంతుల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. మైకెల్ హస్సీ 31 పరుగులు చేసి అవుటయ్యాడు.
భారత్ తొలి ఇన్నింగ్సులో జహీర్ ఖాన్ వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతను 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది టెస్టు మ్యాచుల్లో అతనికి రెండో అర్థ సెంచరీ. తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 430 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్సులో 360 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. జాన్సన్ నాలుగు, వాట్సన్ 3 వికెట్లు తీసుకున్నారు. 313 పరుగుల ఓవరే నైట్ స్కోరుతో భారత్ ఆదివారం ఉదయం తొలి ఇన్నింగ్సును ప్రారంభించింది. మరో 47 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.