స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే టెస్టు సిరీస్ను 0-2తో కోల్పోయింది. సొంతగడ్డపై టెస్టు సిరీస్ను చేజార్చుకోవడం పుష్కరకాలం తర్వాత ఇదే తొలిసారి. అయితే కివీస్తో సిరీస్ అనంతరం క్రికెట్ అభిమానులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలంటే ఈ ట్రోఫీ టీమిండియాకు ఎంతో అవసరం.
మరోవైపు ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ అంతే కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసమే కాకుండా పరువు కోసం ఆస్ట్రేలియా పోరాడటానికి సిద్ధమైంది. 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే కైవసం చేసుకుంటుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారతే విజేత. ఈ నేపథ్యంలో టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఉన్న పాకిస్థాన్ వన్డే, టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా లైట్ తీసుకుంటుంది.

ఒక్కరంటే ఒక్క టెస్టు ప్లేయర్ లేకుండా పాకిస్థాన్తో టీ20 సిరీస్కు జట్టును ప్రకటించింది. ప్రధాన ప్లేయర్లు లేకపోవడంతో వెల్లడించిన జట్టులో కెప్టెన్ ఎవరనే విషయాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) ఇంకా తేల్చలేకపోయింది. సారథి లేకుండా 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అంతేగాక పాకిస్థాన్ సిరీస్కు కోచింగ్ బృందాన్ని కూడా మార్చేసింది. ప్రధాన కోచింగ్ సిబ్బంది కాస్త విరామం తీసుకుని, టీమిండియా సిరీస్ కోసం వ్యూహాలు సిద్ధం చేయనుందని పేర్కొంది.
ప్రతిష్టాత్మక సిరీస్కు ముందు జరిగే సాధారణ సిరీసుల్లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం మామూలే. అదే వ్యూహంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ యువకులకు ఛాన్స్ ఇచ్చింది. కానీ టీమిండియా కోచింగ్ సిబ్బందిని మార్చలేదు. కానీ 'క్రికెట్ ఆస్ట్రేలియా' ఏకంగా కోచింగ్ స్టాఫ్కు కూడా విశ్రాంతి ఇచ్చింది. పాకిస్థాన్ టీ20 సిరీస్కు అసిస్టెంట్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా, సొంతడగడ్డపై నవంబర్ 4 నుంచి 18వరకు పాక్తో ఆసీస్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 22 నుంచి భారత్తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
పాకిస్థాన్ సిరీస్కు ఆస్ట్రేలియా టీ20 జట్టు: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.