హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే ప్రత్యర్థి జట్టుకు ముుందుగా గుర్తొచ్చేది స్లెడ్జింగ్. క్రికెటర్లను స్లెడ్జింగ్ చేయడంలో ఆసీస్ది అందెవేసిన చేయి. అయితే ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం ఇప్పటికే భారత్కు చేరుకున్న ఆసీస్ను స్లెడ్జింగ్ విషయంలో ఆ జట్టు మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ముందుగా హెచ్చరించారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మాటలతో రెచ్చగొట్టవద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ జాసన్ గెలెస్పి ఆ జట్టు ఆటగాళ్లకు సూచించాడు. సెప్టెంబర్ 17న చెన్నైలో జరిగే తొలి వన్డేతో ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాసన్ గిలెస్పీ మీడియాతో మాట్లాడాడు.
మ్యాచ్లో కోహ్లీపై స్లెడ్జింగ్కు దిగితే అతను బౌలర్లపై దూకుడు పెంచుతాడని, అలా కాకుండా వరుసగా బౌన్సర్లు విసిరి అతను క్రీజులో వెనక్కి తగ్గేలా చేయాలని ఆసీస్ బౌలర్లకు గిలెస్పీ సూచించాడు. 'వరుస విజయాలతో జోరు మీదున్న కోహ్లీ సేనకు ప్రస్తుత ఆసీస్ జట్టు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నాను. కోహ్లీ అసాధారణ ఆటగాడు. పవర్ ప్లేలో పరుగులు రాబట్టడంలో కోహ్లీది ప్రత్యేక స్థానం' అని అన్నాడు.
'ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లితో స్లెడ్జ్ చేయొద్దు. కోహ్లీతో ఆసీస్ ఆటగాళ్లు మాటల యుద్ధానికి తిగుతారని అనుకోవడం లేదు. ఆ క్రమంలోనే పరుగులు రాబట్టకుండా చూసుకోండి. పరుగులు సాధించే క్రమంలో కోహ్లీ తప్పు చేయొచ్చు. అతనితో వాగ్వాదానికి దిగకుండా బౌలింగ్ తోనే అతన్ని కవ్వించే యత్నించండి. బౌన్సర్లతో కోహ్లీని రెచ్చగొట్టండి. కోహ్లీ త్వరగా అవుటైతే.. భారత జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది' అని గిలెస్పీ అభిప్రాయపడ్డాడు.
అంతేకాదు కోహ్లీని ఎలా అవుట్ చేయాలో కూడా ఆసీస్ బౌలర్లకు గిలెస్పీ వివరించాడు. 'తొలి పవర్ ప్లే తర్వాత ఫీల్డర్లు కాస్త దూరంగా జరుగుతారు. అప్పుడు కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు. ఆ సమయంలో బౌలర్లు అతడిపై వరుస బౌన్సర్ల ద్వారా ఒత్తిడి పెంచాలి. ఈ క్రమంలో అతడు క్రీజు బయటికి వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే తెలివిగా బౌలింగ్ చేయాలి. ఆన్సైడ్లో ఇద్దరు ఫీల్డర్లను ఉంచాలి. అప్పుడు కోహ్లీ తప్పక దొరుకుతాడు' అని గిలెస్పీ వివరించాడు.