
టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా ఓడింది. నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలకు మంచి ఆరంభాలు లభించాయి. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వీళ్లందరూ విఫలమయ్యారు. ఇక ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ఏమాత్రం ఆకట్టుకోలేదు.
ఈ క్రమంలో ఆసీస్ జట్టుపై పలువురు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆసీస్ మాజీ వికెట్ కీపర్య బ్యాటర్ బ్రాడ్ హడిన్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నాగ్పూర్ పిచ్ అందరూ అనుకున్నంత ఘోరంగా ఏం లేదని హడిన్ అభిప్రాయపడ్డాడు.
'ఈ స్కోరు చూసి పిచ్ మరీ దారుణంగా ఉందని అనుకుంటారు. కానీ అలా ఏం లేదు. మ్యాచ్లో ఐదు ఎల్బీడబ్ల్యూ అవుట్లు స్ట్రెయిట్గా వస్తున్న బంతులకే జరిగాయి. ఆసీస్ బ్యాటర్లను భారత జట్టు పూర్తిగా బుట్టలో వేసుకుంది. పిచ్ ఎలా ఉండబోతోంది? అనే అంశంపై మరీ ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లనే ఆసీస్ ఓడింది' అని హడిన్ అభిప్రాయపడ్డాడు.

స్పిన్ పిచ్ దారుణంగా ఉంటుందనే అభిప్రాయంతో, దానిపై మరీ ఫోకస్ పెట్టడం వల్లనే ఆసీస్ ఓడిందని హడిన్ తేల్చేశాడు. 'వికెట్ గురించి వర్రీ అవడం వల్లనే ఈ ఫలితం వచ్చింది. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్ గురించి జరిగిన చర్చతో వాళ్లు బెదిరిపోయారు అంతే' అని హడిన్ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్లో కేవలం ఒక్క ఇన్నింగ్స్లోనే బ్యాటింగ్ చేసిన భారత జట్టు 400 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. బౌలింగ్లో అశ్విన్, జడేజా విజృంభించడంతో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.