
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ తొలిరోజు అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (83: 141 బంతుల్లో 8 ఫోర్లు), డేవిడ్ మలాన్ (55 నాటౌట్: 160 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 233/5 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మలన్ (55) పరుగులతో ఉన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్ అలిస్టర్ కుక్ (39: 104 బంతుల్లో 3x4) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.
అతనితో పాటు మరో ఓపెనర్ మార్క్ స్టోన్మాన్ (24), విన్స్ (25)లు తొందరగానే పెవిలియన్కు చేరడంతో ఇంగ్లాండ్ 95/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో మలాన్తో కలిసి కెప్టెన్ రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కి 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే ఓవర్ వ్యవధిలో మ్యాచ్ ముగుస్తుందనగా.. సెంచరీకి చేరువైన జో రూట్ (83) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బారిస్టో (5) కూడా ఔట్ కావడంతో 227/3 నుంచి ఇంగ్లాండ్ 233/5తో తొలిరోజుని ముగించింది.
ఇప్పటికే ముగిసిన నాలుగు టెస్టుల్లో వరుసగా మూడింటిలో ఓటమిపాలై టెస్టు సిరిస్ను చేజార్చుకున్న మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టుని ఇంగ్లాండ్ డ్రాగా ముగించింది. దీంతో కనీసం ఐదో టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.