భారత్తో జరగనున్న కీలకమైన వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియా అభిమానులను నిరాశపరిచింది.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకారం.. కమిన్స్కు వెన్నెముకలో నొప్పి ఉందని, ఈ కారణంగానే ప్యాట్ కమిన్స్ న్యూజిలాండ్, భారత్తో జరిగే సిరీస్లకు దూరంగా ఉంటాడని పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నయాషెస్ సిరీస్ నాటికి ఫిట్గా ఉండడానికి కమిన్స్ విశ్రాంతి తీసుకోనున్నాడు.

భారత్కు అనుకూలం
ప్యాట్ కమిన్స్ లేకపోవడం భారత జట్టుకు లాభం చేకూర్చనుంది. ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు కమిన్స్ లాంటి అగ్రశ్రేణి పేసర్ ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కమిన్స్ గతంలో ఈ ఇద్దరు దిగ్గజాలను అంతర్జాతీయ క్రికెట్లో 19 సార్లు ఔట్ చేసి భారత బ్యాటర్లకు సవాల్ విసిరాడు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా పేస్ దాడి బలహీనపడే అవకాశం ఉంది.
సిరీస్ షెడ్యూల్ ఇలా..
భారత్తో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మ్యాచ్ల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు సమాచారం. అక్టోబర్ 19 నుంచి భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు(19, 23, 25), 5 టీ20లు( అక్టోబర్ 29, 31, నవంబర్ 2, 6, 8) జరుగుతాయి. దీని తర్వాత ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరుగనుంది. కమిన్స్ తన ఫిట్నెస్ను తిరిగి సాధించి యాషెస్ సిరీస్లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఈ కీలక సమయంలో అతని గాయం ఆస్ట్రేలియా జట్టుకు ఒక పెద్ద సవాలుగా మారింది.