
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ను 4-0తో ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఓ షాట్ స్టేడియంలోని అభిమానులను నవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ అభిమానులతో పంచుకోగా... అది వైరల్గా మారింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 175/8తో ఉన్న దశలో స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్కి వచ్చాడు.
నాథన్ లియాన్ విసిరిన బంతిని, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ టామ్ కుర్రాన్ డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి అతని బ్యాట్ అంచును తాకి ఆ తర్వాత వికెట్ కీపర్ టిమ్ పైనీకి కూడా చిక్కకుండా.. వెనక్కి వెళ్లి అక్కడ ఉంచి కీపర్ హెల్మెట్ని తాకిన బంతి.. దాదాపు అదే వేగంతో థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ లైన్ సమీపానికి వెళ్లి ఆగింది.
దీంతో.. ఫీల్డ్ అంపైర్ పెనాల్టీ రూపంలో ఇంగ్లాండ్ స్కోరు బోర్డుకి 5 అదనపు పరుగులు కలిపాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన ప్రకారం బంతి మైదానంలో కీపర్ హెల్మెట్ను తాకితే ఆ జట్టు పెనాల్టీ రూపంలో 5 పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.