కోహ్లీ ఆడితే భారత్ కప్ గెలుస్తుంది
అంతేకాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్లో మెరుగ్గా ఆడితే.. భారత్ కప్ గెలుస్తుందని పాంటింగ్ తెలిపాడు. ఇక, వరల్డ్కప్లో టీమిండియా రెండో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ బెటర్ ఆప్షన్ అని తెలిపాడు. టైమ్స్ ఆప్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో పాంటింగ్ పలు అంశాలపై స్పందించాడు.
కోహ్లీ, సచిన్లలో ఎవరు అత్యుత్తమం
కోహ్లీ, సచిన్లలో ఎవరు అత్యుత్తమం అనే ప్రశ్నకు మాత్రం పాంటింగ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. కోహ్లీ కెరీర్ ముగిసేంత వరకు ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేమని పాంటింగ్ అన్నాడు "సచిన్ ఓ లెజెండ్.. అయితే కోహ్లీ వేగంగా పరుగులు రాబడుతున్నాడు. టెస్టుల్లో కోహ్లీ సగటు 50 శాతం పైనే ఉంది. కానీ, సచిన్ దాన్ని 200 టెస్టుల వరకు నిలబెట్టుకున్నాడు" అని అన్నాడు.
వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది
"వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. అందుకే వరల్డ్కప్లో భారత్ ప్రమాదకర జట్టు అని భావిస్తున్నా" అని పాంటింగ్ తెలిపాడు. మరోవైపు ఈ వరల్డ్ కప్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు వెళ్తాయని పాంటింగ్ అంచనా వేశాడు. మే30న ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
పుజారాను నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుంటుంది: దాదా
మరోవైపు పుజారాను ప్రపంచకప్కు ఎంపిక చేసి, అతడిని నాలుగో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ గంగూలీ ఓ ఆశ్చర్యకర సూచన చేసిన సంగతి తెలిసిందే. "నా మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. నా సూచనకు వాళ్లు నవ్వొచ్చు కూడా. నా వరకైతే ‘నంబర్ 4'కు పుజారా చక్కగా సరిపోతాడు. ఫీల్డింగ్లో అతడు మరీ చురుకు కాదని తెలుసు కానీ మంచి బ్యాట్స్మన్. నా మాటలతో కొందరు దిగ్భ్రాంతికి గురవుతారని నాకు తెలుసు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
పుజారా నాణ్యమైన బ్యాట్స్మన్
"కానీ, టీమిండియా ప్రయత్నించిన ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పుజారా నాణ్యమైన బ్యాట్స్మన్. కొన్నిసార్లు వన్డే క్రికెట్లో పటిష్టత అవసరమైనప్పుడు పుజారా ఆ కొరత తీరుస్తాడు. ముఖ్యంగా జట్టులోని టాప్-3 బ్యాట్స్మెన్కు టన్నుల కొద్దీ పరుగులు చేసే సత్తా ఉన్నప్పుడు అతడు జట్టులో చక్కగా ఇమిడిపోతాడు" అని గంగూలీ చెప్పాడు. ఒకప్పుడు భారత వన్డే జట్టులో రాహుల్ ద్రవిడ్ పోషించిన పాత్రలో ఇప్పుడు పుజారా సరిగ్గా సరిపోతాడని గంగూలీ చెప్పాడు.