
మెల్బోర్న్: మెల్బోర్న్లో మంగళవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్లో ఓడి బాధలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతం విధించారు. అంతేకాదు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్లలో ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లను కూడా కోల్పోయింది. ఐసీసీ ఎలైట్ ప్యానల్లో ఉన్న మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఆస్ట్రేలియాకు జరిమానా విధించారు.
బాక్సింగ్ డే టెస్టులో నిర్ణత సమయంలోగా ఓవర్లను వేయడంలో ఆస్ట్రేలియా విఫలమైంది. టిమ్ పైన్ బృందం నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. ఐసీసీ క్రమశిక్షణా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలోగా ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు గాను ఆటగాళ్లకు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఆస్ట్రేలియా రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఆ జట్టుకు 40 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
టెస్ట్ చాంపియన్షిప్లో ఉన్న ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ఒక ఓవర్ స్లోగా వేస్తే సదరు జట్టుకు రెండు పాయింట్లు మైనస్ చేస్తారు. ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టులో నిర్ణత సమయంలోగా రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు.. కీలకమైన నాలుగు పాయింట్లను కోల్పోంది. తప్పిదంను అంగీకరించిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.. జరిమానాను ఆమోదిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఎలాంటి విచారణ అవసరం లేకుండా పోయింది.
ఆన్-ఫీల్డ్ అంపైర్లు బ్రూస్ ఆక్సెన్ఫోర్డ్ మరియు పాల్ రీఫెల్.. మూడవ అంపైర్ పాల్ విల్సన్ మరియు నాల్గవ అంపైర్ గెరార్డ్ అబూద్ కలిసి ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా విధించారు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (322), భారత్ (390), న్యూజిలాండ్ (300) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మూడవ టెస్ట్ జనవరి 7న సిడ్నీలో ప్రారంభం కానుంది. అయితే అక్కడ కోవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉండడంతో మెల్బోర్న్లో మూడో టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.