India vs Australia: టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా జట్టు అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సిరీస్కు ముందు ఆసీస్ జట్టుకు రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారత్తో జరగబోయే తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ తొలి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్లో జరగనుంది. వారి స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్లను జట్టులోకి తీసుకున్నారు. జోష్ ఫిలిప్ మొదటిసారి వన్డేలలో వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
ఆ స్టార్ ఆటగాళ్లు ఎందుకు దూరమయ్యారు?
ఆడమ్ జంపా తండ్రి కానున్నాడు. అతడి భార్య త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆడమ్ జంపా అందుబాటులో ఉండడం లేదు. అయితే అతను సిరీస్లోని చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు జోష్ ఇంగ్లిస్ ఇంకా పిక్క కండరం గాయం నుంచి కోలుకోలేదు. ఈ గాయం కారణంగానే అతను న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఆడలేకపోయాడు. దీంతో జోష్ ఇంగ్లిస్ అక్టోబర్ 23న అడిలైడ్లో జరిగే రెండో వన్డేలో ఆడటం కూడా కష్టమే. అయితే అలెక్స్ కారీ రెండో మ్యాచ్లో తిరిగి జట్టుతో చేరనున్నాడు. యాషెస్ సన్నాహాల్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ ఆడటం వల్ల కారీ మొదటి మ్యాచ్లో ఆడటం లేదు.

మూడో వన్డే కల్లా ఇంగ్లిస్ ఫిట్ అవుతాడా?
జోష్ ఇంగ్లిస్ మూడో వన్డే (అక్టోబర్ 25, సిడ్నీ) నాటికి ఫిట్ అవుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశిస్తోంది. జంపా దూరం కావడంతో, మాథ్యూ కుహ్నెమాన్ మొదటి వన్డేలో ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అతను 2022లో శ్రీలంకతో నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఈ ఫార్మాట్లో మూడేళ్ల తర్వాత అతను ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే అవుతుంది.
యాషెస్ దృష్ట్యా జట్టు సమతుల్యత సవాలు
ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా సెలెక్టర్లు వన్డే జట్టును సమతుల్యం చేయడంలో ఓ పెద్ద సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో జరగబోయే యాషెస్ సిరీస్ను కూడా వారు దృష్టిలో ఉంచుకుంటున్నారు. అలెక్స్ కారీ మాదిరిగానే కెమెరూన్ గ్రీన్ కూడా సిడ్నీలో జరిగే చివరి మ్యాచ్కు దూరమవుతాడు. రెడ్ బాల్తో (టెస్ట్ క్రికెట్) కొంత ప్రాక్టీస్ చేయడానికి అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతను అక్టోబర్ 28 నుండి పెర్త్లో ప్రారంభమయ్యే షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లో పాల్గొంటాడు. గ్లెన్ మాక్స్వెల్ మణికట్టుకు ఫ్రాక్చర్ అవడం వల్ల ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే అతని లేకుండానే ఆడుతోంది.
సిరీస్ షెడ్యూల్:
మొదటి వన్డే: అక్టోబర్ 19, పెర్త్
రెండో వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్
మూడో వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ
మొదటి టీ20: అక్టోబర్ 29, కాన్బెర్రా
రెండో టీ20: అక్టోబర్ 31, మెల్బోర్న్
మూడో టీ20: నవంబర్ 2, హోబర్ట్
నాలుగో టీ20: నవంబర్ 6, గోల్డ్ కోస్ట్
ఐదో టీ20: నవంబర్ 8, బ్రిస్బేన్
భారత్తో ఆస్ట్రేలియా వన్డే జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొనోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మ్యాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.