హైదరాబాద్: సిడ్నీ వేదికగా పాకిస్ధాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. రోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 2 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. అంతక ముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ను 538/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
సిడ్నీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (113), మ్యాథ్ రెన్షా (167 నాటౌట్) పరుగులతో తొలి వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హ్యండ్స్కోంబ్ 215 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.
ఇలా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరుని సాధించింది. లంచ్ విరామానికి ముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 78 బంతుల్లోనే సెంచరీ చేసి అరుదైన ఘనతను సాధించాడు. ఈ సెంచరీతో 40 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ సెషన్లో సెంచరీ సాధించిన క్రికెటర్గా డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు.

మరోవైపు 87 ఏళ్ల తర్వాత ఆసీస్ తరపున ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. లంచ్ విరామానికి ముందు సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత తనఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఓపెనర్ రెన్ షా తన కెరీర్లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలచడంలో విఫలమయ్యాడు.
రెండో రోజైన బుధవారం 365/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ని కొనసాగించిన ఓపెనర్ రెన్ షా 293 బంతులను ఎదుర్కొని 20 ఫోర్ల సాయంతో 184 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. అయితే రెన్ షా కూడా ఈ టెస్టులో ఓ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
పాకిస్థాన్పై సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడైన ఓపెనర్గా అరుదైన గుర్తింపు పొందాడు. 1983లో భారత ఓపెనర్ రవిశాస్త్రి కరాచీలో పాకిస్థాన్పై సెంచరీ చేశాడు. అప్పుడు శాస్త్రి వయసు 20 ఏళ్ల 248 రోజులు కాగా, సిడ్నీలో మంగళవారం సెంచరీ సాధించిన రెన్షా వయసు 20 ఏళ్ల 281 రోజులు.
అంతేకాదు పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో ఆస్ట్రేలియా ఓపెనర్గా రెన్షా కూడా గుర్తింపు పొందాడు. అంతక ముందు ఆర్చీ జాక్సన్, ఫిలిప్ హ్యుగ్స్లు రెన్షా కంటే చిన్నవయసులోనే సెంచరీలు సాధించిన వారి జాబితాలో ఉన్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒకే ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేయడం 2002 తర్వాత ఇదే తొలిసారి.
15 ఏళ్ల కిందట లాంగర్, హెడెన్ దక్షిణాఫ్రికాపై సెంచరీలు సాధించారు. ఓవరాల్గా సిడ్నీలో ఓపెనర్లిద్దరూ ఒకే ఇన్నింగ్స్లో శతకాలు చేయడం ఇది మూడోసారి మాత్రమే. 1986లో భారత ఓపెనింగ్ జోడి శ్రీకాంత్, గవాస్కర్లు సెంచరీలు సాధించారు. సిడ్నీలో 17 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్, 10 టెస్టులు ఆడిన ఇయాన్ ఛాపెల్ ఒక్క సెంచరీ కూడా చేయని వారి జాబితాలో ఉన్నారు.