టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టింది. భారత్, అఫ్గానిస్థాన్ చేతిలో ఓడి సెమీఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. అయితే తమ మ్యాచ్లు ముగిసిన తర్వాత అదృష్టంపై ఆధారపడిన ఆసీస్ ఓ దశలో సెమీస్కు చేరేలా కనిపించింది. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ పరాజయాన్ని చవిచూసేలా పరిస్థితులు ఏర్పడటంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆశలు చిగురించాయి.
కానీ అంతిమంగా బంగ్లాదేశ్పై అఫ్గానిస్థాన్ గెలవడంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్ను తానెంతో ఆస్వాదించానని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అన్నాడు. సెమీస్కు చేరని బాధను పక్కనపెడితే గుల్బాదిన్ నైబ్ చేసిన యాక్టింగ్ను చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వనాని తెలిపాడు. నవ్వలేక తన కళ్లల్లో నుంచి నీళ్లు వచ్చాయని మార్ష్ పేర్కొన్నాడు.

అఫ్గాన్ మ్యాచ్లో బంగ్లా ఛేజింగ్ సమయంలో అఫ్గానిస్థాన్ కోచ్ జొనాతన్ ట్రోట్ ఇచ్చిన సూచనలతో గుల్బాదిన్ నైబ్ అకస్మాతుగా కిందపడిపోయిన విషయం తెలిసిందే. కండరాలు పట్టేశాయని నటించాడు. మ్యాచ్ను స్లో చేస్తే తమకు కలిసొస్తుందని అఫ్గాన్ కోచ్ చెప్పడంతో నైబ్ యాక్టింగ్ ఇరగదీశాడు. దీంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయి, అఫ్గాన్కు ఫేవరేట్గా మారింది. బంగ్లా ఛేదనకు 19 ఓవర్లకు కుదించి ఓ పరుగును తగ్గించారు.
అయితే నైబ్ కాసేపటికే నొప్పి తగ్గిపోయిందని వచ్చి రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. అంతేగాక ఓ వికెట్ పడగొట్టాడు. గెలిచిన తర్వాత పరిగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. దీంతో నైబ్ నటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాని గురించి మిచెల్ మార్ష్ స్పందించాడు. ''నవ్వినవ్వి.. నా కళ్లలో నుంచి నీళ్లు వచ్చేశాయి. అయితే అతను చేసి పని అంతిమంగా మ్యాచ్పై ప్రభావం చూపించలేదు. కానీ దాని గురించి నవ్వుకున్నాం. అదెంతో ఫన్నీగా ఉంది''
''అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ను అందరం కలిసి వీక్షించాం. మ్యాచ్ ఎంతో అద్భుతంగా సాగింది. ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. అయితే టోర్నీలో కొనసాగాలనే ఎవరైనా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అన్నీ మన చేతుల్లో ఉండవు. బంగ్లాదేశ్ ఆఖరి వికెట్ పడిన తర్వాత అందరం మౌనంగా ఉండిపోయాం. అయితే అఫ్గానిస్థాన్ గొప్పగా ఆడింది. మమ్మల్ని, బంగ్లాదేశ్ ఓడించింది. సెమీఫైనల్స్కు చేరడానికి అఫ్గాన్ జట్టుకే అర్హత ఉంది'' అని మిచెల్ మార్ష్ అన్నాడు.