
వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్
రెండో ఇన్నింగ్స్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజైన శుక్రవారం ఇరు జట్ల బౌలర్లూ సత్తా చాటారు. పిచ్ బౌలింగ్కు అనుకూలించడంతో ఒకే రోజు మొత్తం 15 వికెట్లు నేలకూల్చారు. దీనిని బట్టి చూస్తుంటే పిచ్ బౌలింగ్కు ఎంత అనుకూలించిందో స్పష్టంగా అర్థం అవుతోంది.
నాలుగు వికెట్లు తీసిన కమ్మిన్స్
ఆసీస్ బౌలర్ కమ్మిన్స్ చెలరేగడంతో విహారి (13), పుజారా (0), కోహ్లీ (0), రహానే (1) పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన పుజారా, హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీలు డకౌట్ కావడం గమనార్హం. రోహిత్ శర్మ(5)ను హాజెల్వుడ్ ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో భారత్ ఇలా వరుసగా వికెట్లను కోల్పోయి ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మ్యాచ్పై ఆశలు రేకిత్తించిందని అంటున్నారు.
ఫాలోఆన్ ఆడిస్తే ఒత్తిడిలో
విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించడం తప్పిదమేనని, ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడిస్తే ఒత్తిడిలో త్వరగా వికెట్లు కోల్పోయేవారని, అప్పుడు భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పోయిందేమి లేదనే వారు కూడా ఉన్నారు.
భారత్ ఆధిక్యం 346
మొత్తానికి మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 27 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి 54 పరుగుల చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషబ్ పంత్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. కమ్మిన్స్ నాలుగు, హాజెల్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications












