గాయపడ్డ ఖవాజా, స్టాయినిస్
దక్షిణాఫ్రికాతో చిట్టచివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఉస్మాన్ ఖవాజా గాయపడ్డ విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో అతని కాలి కండరాలు పట్టేశాయి. దీనితో ఖవాజా అర్ధాంతరంగా క్రీజు నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ బ్యాటింగ్కు వచ్చినప్పటికీ.. మునుపటి వేగం అతనిలో కనిపించలేదు. కండరాల నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు గానీ.. దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలం అయ్యాడు. మార్కస్ స్టాయినిస్ సైతం ఇదే గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఈ ఆల్రౌండర్.. ఈ నెల 11వ తేదీన ఇంగ్లండ్తో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్కు అందుబాటులో ఉండట్లేదు.
వేడ్, మిఛెల్ మార్ష్
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, స్టాయినిస్ల స్థానంలో మాథ్యూ వేడ్, మిఛెల్ మార్ష్లను జట్టులోకి తీసుకోబోవచ్చని సమాచారం. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా- ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. మాంచి ఊపు మీదున్నాడు. ఇంగ్లండ్లో పర్యటిస్తోన్న ఆస్ట్రేలియా-ఎ టీమ్ తరఫున ఆడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ వరుసగా సెంచరీలు సాధిస్తున్నాడు.
ఆస్ట్రేలియా-ఏ తరఫున ఆడుతున్న వేడ్..
ఈ క్రమంలో- ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 45 బంతుల్లో వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 68 బంతుల్లో 150 పరుగులను పూర్తిచేశాడు. 71 బంతుల్లో 155 రన్స్ సాధించాడు. ఆస్ట్రేలియా లిస్ట్-ఎ క్రికెట్ విభాగంలో ఇదే అత్యుత్తమ సెంచరీ. ఇంత తక్కవ బంతుల్లో లిస్ట్-ఎలో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ మరొకరు లేరు. ఇంగ్లండ్లో డెర్బిషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా మాథ్యూ వేడ్ ఈ ఫీట్ సాధించాడు. మెరుపు వేగంతో వేడ్ సాధించిన సెంచరీతో ఆస్ట్రేలియా-ఏ జట్టు ఘన విజయం సాధించింది.
ఫాస్టెస్ట్ సెంచరీ..
తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బిషైర్ జట్టు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా-ఏ జట్టు ముందు ఉంచింది. బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా-ఏ టీమ్ 35.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో మాథ్యూ వేడ్ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. మొత్తం 45 బంతుల్లో వంద పరుగులను చేశాడు. సెంచరీ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. సెంచరీలో తొలి ఫిఫ్టీని 20 బంతుల్లో ఫినిష్ చేశాడు. రెండో ఫిఫ్టీ కోసం 25 బంతులు తీసుకున్నాడు. మొత్తం 71 బంతుల్లో 14 ఫోర్లు 11 సిక్సర్లతో 155 పరుగులు చేశాడు.
ఏబీ రికార్డు బద్దలు..
లిస్ట్-ఎ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీని అధిగమించిన రికార్డు ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉంది. 2015లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. రెండో స్థానంలో మాథ్యూ వేడ్ నిలిచాడు. డెర్బిషైర్తో మ్యాచ్లో 68 బంతుల్లో 150 రన్స్ చేశాడు. వెస్టిండీస్పై 76 బంతుల్లోనే 150 పరుగులు చేసిన జోస్ బట్లర్.. ఇదే జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్కు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. తమిళనాడు జట్టు తరఫున ఆడిన దినేష్ కార్తీక్ హైదరాబాద్పై 80 బంతుల్లో 150 రన్స్ చేశాడు.