
భారత్లో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. ఈ విషయం ఆస్ట్రేలియాకు కూడా తెలుసు. అందుకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇక్కడకు వచ్చిన కంగారూలు కఠోరంగా శ్రమిస్తున్నారు. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెషన్స్లో చెమటలు చిందిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా ఒక పిచ్ కూడా తయారు చేశారు. ఈ పిచ్పై ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు కూడా.
ఉపఖండంలో పిచ్లపై బ్యాటింగ్ చేయడం విదేశాల నుంచి వచ్చిన ఎలాంటి బ్యాటర్కైనా పెద్ద సవాల్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దీనికితోడు టీమిండియాలో అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ప్రమాదకర స్పిన్నర్లు ఉన్నారు. వీరిలో అశ్విన్, జడేజా టెస్టు సిరీస్లో భారత్కు చాలా కీలకం. ముఖ్యంగా అశ్విన్ అయితే ఉపఖండ పిచ్లపై చెలరేగుతాడు. బంగ్లాదేశ్తో జరిగిన చివరి టెస్టులో కూడా అతను ఆకట్టుకున్నాడు. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించడం అతని స్పెషాల్టీ. భారత పిచ్లపై అశ్విన్ను ఎదుర్కోవడం ఎంత కష్టమో ఆస్ట్రేలియా బ్యాటర్లకు తెలుసు. ఆ జట్టులోని ప్రధాన బ్యాటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ ముగ్గురూ గతంలో అశ్విన్ను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో చాలా కష్టపడ్డారు.
ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే అశ్విన్ మరింత ప్రమాదకరంగా మారతాడు. ఈ క్రమంలోనే అశ్విన్ను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా బృందం ప్రత్యేకంగా ఒక ప్లాన్ వేసింది. అచ్చం అశ్విన్లా బౌలింగ్ చేసే యువ స్పిన్నర్ను తమ నెట్ బౌలర్గా చేర్చుకుంది. బరోడా తరఫున ఆడే మహీష్ పితియా బౌలింగ్ యాక్షన్ అచ్చుగుద్దినట్లు అశ్విన్లాగే ఉంటుంది. అందుకే అతన్ని తమ నెట్ బౌలర్గా చేర్చుకొని తెగ ప్రాక్టీస్ చేస్తోంది ఆసీస్ టీం. సోషల్ మీడియాలో మహీష్ బౌలింగ్ చూసిన ఆసీస్ సహాయ సిబ్బంది.. తమ ప్రాక్టీస్ క్యాంప్లో అతని సేవలు కావాలని తెప్పించుకుంది. అశ్విన్ను ఎదుర్కోవడానికి మహీష్ బౌలింగ్లో ఆసీస్ జట్టు ప్రాక్టీస్ చేస్తోంది.