ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 138 ఏళ్ల తర్వాత సిడ్నీ గడ్డపై ఇలా జరగడం ఇదే తొలిసారి. సాధారణంగా సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పేరు. కానీ ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగింది.
1888వ సంవత్సరం తర్వాత అంటే దాదాపు 138 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. సిడ్నీలో ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్పిన్నర్ లేకుండా ఆడటం ఇదే మొదటిసారి. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-1తో కైవసం చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే తడబడింది. కేవలం 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సీనియర్ బ్యాటర్ జో రూట్, యంగ్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని, ఇంగ్లాండ్ స్కోరును 200 దాటించారు. ప్రస్తుతం ఇద్దరూ సెంచరీల దిశగా సాగుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జేక్ వెథరల్డ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్స్టర్,మైఖేల్ నెసర్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్
ఇంగ్లాండ్ జట్టు
బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, మాథ్యూ షాట్స్, జోష్ టంగ్
ఇంగ్లాండ్ జట్టు బాక్సింగ్ డే టెస్టులో గెలిచి, 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తమ మొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసిన ఉత్సాహంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ చివరి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను ఘనంగా ముగించాలని చూస్తోంది.