మరో 31 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ మహా సమరానికి ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సారథ్యంలో 15 మందితో కూడిన బృందాన్ని బుధవారం వెల్లడించింది. గత టీ20 సిరీస్ల్లో ఆసీస్కు మార్ష్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించినా వరల్డ్ కప్లో సారథిగా అతనికి అవకాశం ఇస్తారో అనే సందేహాలు ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్ షిప్ను సాధించిన కమిన్స్కే టీ20 వరల్డ్ కప్లో కెప్టెన్గా అవకాశం ఇస్తారని కథనాలు వచ్చాయి. కానీ మెగాటోర్నీలో ఆస్ట్రేలియాను మిచెల్ మార్ష్ నడిపించనున్నాడు. అయితే కొందరు స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి చూపిస్తూ ఆసీస్ జట్టును ప్రకటించింది. సీనియర్ స్టీవ్ స్మిత్, యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, ఫాస్ట్ బౌలర్ బెహ్రెన్డార్ఫ్పై వేటు పడింది.

బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేసిన ఫ్రేజర్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటారని భావించారంతా. కానీ అతనికే నిరాశే మిగిలింది. మరోవైపు దాదాపు ఏడాదిన్నర పాటు టీ20లకు దూరమైన ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆస్టన్ అగర్కు జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్లో రాణిస్తున్న మార్కస్ స్టొయినిస్, కామెరూన్ గ్రీన్ కూడా ఎంపికయ్యారు.
కాగా, జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 5న బార్బడోస్ వేదికగా ఒమన్తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-బిలో ఉన్న ఆస్ట్రేలియాలో ఒమన్తో పాటు స్కాట్లాండ్, ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్ దేశాలతో గ్రూప్ దశలో తలపడనుంది.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోస్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.