సిడ్నీ: యాషెస్ సిరీస్లో భాగంగా బుధవారం నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బ్రిస్బేన్, ఆడిలైడ్, మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి మూడు టెస్టు మ్యాచ్లను గెలిచిన అతిథ్య ఆస్ట్రేలియా జట్టు.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం సిరీస్ను 5-0 తో గెలుచుకుని ఇంగ్లండ్ను వైట్వాష్ చేయడంపై ఆ జట్టు దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియాలోని బ్యాటర్లు, బౌలర్లు అంతా సమిష్టిగా రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒకే ఒక్క మార్పుతో బరిలో దిగనుంది. ఈ మేరకు ఆసీస్ మేనేజ్మెంట్ తమ తుది జట్టును ప్రకటించింది. కరోనా వైరస్ బారిన పడిన బ్యాటర్ ట్రావియస్ హెడ్ స్థానంలో ఉస్మాన్ ఖవాజాను ఆస్ట్రేలియా తమ తుది జట్టులోకి తీసుకుంది. ఖవాజా తన చివరి టెస్టు మ్యాచ్ను 2019 యాషెస్ సిరీస్లోనే హెడ్డింగ్లీ మైదానంలో ఆడాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు:
డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరోవైపు యాషెస్ సిరీస్లో ఫేలవ ప్రదర్శనతో పర్యాటక జట్టు ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను 0-3తో చేజార్జుకుంది. దీంతో మిగిలిన రెండు మ్యాచ్ల్లోనైనా సత్తా చాటి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో అన్ని విభాగాల్లో ఆ జట్టు విఫలమైంది. ఇటు బ్యాటింగ్లో, అటు బౌలింగ్లో రాణించలేకపోతుంది. బ్యాటింగ్లో కెప్టెన్ రూట్ మినహా మిగతా వారు దారుణంగా విఫలమవుతున్నారు. దీనికి తోడు కరోనా కేసులు ఆ జట్టును కలవర పెడుతున్నాయి. దీంతో సిడ్నీ టెస్టులోనైనా కలిసి కట్టుగా రాణించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది. సిడ్నీ టెస్టుకు ఇంగ్లండ్ కూడా తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ సైతం ఒకే మార్పుతో బరిలోకి దిగుతోంది. పేసర్ ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ను తుది జట్టులోకి తీసుకుంది. రాబిన్సన్ ఈ మ్యాచ్కు విశ్రాంతి తీసుకోనున్నాడు.
ఇంగ్లండ్ తుది జట్లు:
హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్స్టో, జోస్ బట్లర్, మార్క్ వుడ్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.