ఆస్ట్రేలియా పర్యటనను భారత్-ఏ జట్టు పేలవంగా ముగించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్టులోనూ ఓటమిపాలైంది. ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలో ఛేదించింది. సామ్ కొనస్టాస్ (73 నాటౌట్; 128 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), వెబ్స్టర్ (46 నాటౌట్; 66 బంతుల్లో, 6 ఫోర్లు) సత్తాచాటారు.
భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు, ముకేశ్ కుమార్, తనుష్ కొటియన్ తలో వికెట్ తీశారు. అయితే ఛేదనలో ఆస్ట్రేలియా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మార్కస్ హారిస్, కామెరూన్ బెన్క్రాఫ్ట్లను ప్రసిధ్ కృష్ణ గోల్డెన్ డకౌట్ చేశాడు. కొద్దిసేపటికి ముకేశ్, తనుష్ కూడా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన వెబ్స్టర్తో కలిసి సామ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు సాధికారికంగా ఆడుతూ ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు 73/5 ఇవాళ ఆటను ఆరంభించిన భారత్-ఏ జట్టు 77.5 ఓవర్లలో 229 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (68; 122 బంతుల్లో, 5 ఫోర్లు) మరోసారి జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకంతో సత్తాచాటాడు. తనుష్ కొటియన్ (44; 84 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), ప్రసిధ్ కృష్ణ (29; 43 బంతుల్లో, 5 ఫోర్లు) కీలక పరుగులు చేశారు.
కాగా, భారత్-ఏ తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (80) పోరాడాడు. నీజర్ నాలుగు వికెట్లు, వెబ్స్టర్ మూడు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 223 పరుగులు చేసింది. ప్రసిధ్ కృష్ణ నాలుగు వికెట్లు, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో పడగొట్టారు. మార్కస్ హారిస్ (70) టాప్ స్కోరర్.