
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని తల్లి మరియా కమిన్స్ కన్నుమూశారు. భారత్లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచుల తర్వాత మూడో టెస్టులో కమిన్స్ ఆడలేదు. తల్లికి అనారోగ్యం చేయడంతో స్వదేశం వెళ్లిపోయాడు. ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో నాలుగో టెస్టుకు కూడా కమిన్స్ తిరిగిరాలేదు. ఇలాంటి సమయంలో కమిన్స్ తల్లి మరణించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నాలుగో టెస్టు రెండో రోజున ఆసీస్ ఆటగాళ్లందరూ చేతికి నల్లటి ఆర్మ్బ్యాండ్ ధరించి ఆడతారని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. 'మరియా కమిన్స్ మరణవార్త తెలిసి మేం చాలా బాధపడుతున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ప్యాట్ కమిన్స్, అతని కుటుంబం, స్నేహితులకు మా సంతాపం తెలుపుతున్నాం.
మరియా గౌరవార్ధం ఈ రోజు ఆస్ట్రేలియా జట్టు నల్లటి ఆర్మ్బ్యాండ్లు ధరించి బరిలో దిగుతుంది' అని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. భారత క్రికెట్ బోర్డు కూడా మరియా మరణంపై స్పందించింది. 'భారత క్రికెట్ తరఫున మరియా మరణంపై చాలా బాధ పడుతున్నాం. ఈ కష్టకాలంలో ప్యాట్, అతని కుటుంబానికి మా సానుభూతి ఉంటుంది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
కొంత కాలంగా బ్రెస్ట్ క్యాన్సర్తో మరియా బాధ పడుతున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ క్రమంలోనే భారత్లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి అర్ధంతరంగా ప్యాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లాడు. 'ఇప్పుడు నా కుటుంబంతో ఉండటమే ముఖ్యం అనుకుంటున్నా. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, జట్టు నుంచి నాకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు. నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అని కొన్ని రోజుల క్రితం ప్యాట్ కమిన్స్ చెప్పాడు.