సిడ్నీ: శ్రీలంక మహిళ క్రికెటర్, టీ20 కెప్టెన్ చమరీ ఆటపట్టు అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి శ్రీలంక మహిళ క్రికెటర్గా చమరీ ఆటపట్టు అరుదైన ఘనతను సాధించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చమరీ ఈ రికార్డు సాధించింది. 66 బంతుల్లో చమరీ సెంచరీ చేసినా.. జట్టును గెలిపించలేకపోయింది. మరోవైపు వన్డే, టీ20లలో సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్గా ఆటపట్టు నిలిచింది.
కొత్త లుక్లో యువరాజ్ ఫొటో.. ట్రోల్ చేసిన సానియా మీర్జా!!
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోర్ చేసింది. బెత్ మూనీ (113) సెంచరీతో చెలరేగగా.. యాష్లె గార్డెనర్ (49) పరుగులతో రాణించింది. పవర్ప్లేలో ఆసీస్ వేగంగా పరుగులు చేసింది. 18 బంతుల్లో 35 పరుగులు చేసిన అలిస్సా హీలీ ఇన్నింగ్స్కు ఊపు తెచ్చింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (1) త్వరగానే పెవిలియన్ చేరినా.. మూనీ, గార్డనర్ సెంచరీ స్టాండ్ కారణంగా ఆసీస్ 200 మార్క్ అందుకుంది. లంక బౌలర్ ఓషాది రణసింగ్ రెండు వికెట్లు తీసింది.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనవసరమైన రనౌట్ కారణంగా లంక మొదటి వికెట్ కోల్పోయింది. పవర్ప్లేలో లంక 2 వికెట్లకు 34 పరుగులు మాత్రమే చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. అయితే చమరీ 66 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులతో సెంచరీ చేసినా.. మిగతావారి సహకారం లేకపోవడంతో లంకకు ఓటమి తప్పలేదు. జార్జియా వేర్హామ్ రెండు వికెట్లు తీసింది. 176 పరుగులు శ్రీలంక టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ కావడం విశేషం. చమరీ రికార్డు సెంచరీకి తగిన ఫలితం దక్కలేదు.
మ్యాచ్ అనంతరం ఆటపట్టు మాట్లాడుతూ...'నా మొదటి టీ20 సెంచరీ సాధించడం చాలా అద్భుతంగా ఉంది. వన్డే, టీ20లలో సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్గా నిలవడం గర్వంగా ఉంది. సెంచరీ చేసినా మ్యాచ్ ఓడిపోవడం నిరాశపరిచింది. కానీ, ఆటగాళ్ల కృషికి గర్వపడుతున్నా. ఎందుకంటే ఇది శ్రీలంక మహిళల జట్టు టీ20 అంతర్జాతీయంలో నమోదు చేసిన అత్యధిక స్కోరు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై అన్ని పరుగులు చేయడం విశేషం' అని పేర్కొంది.