స్కాట్లాండ్తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు స్కాట్లాండ్పై ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 12 ఫోర్లు, అయిదు సిక్సర్లతో విరుచుకుపడి ఏకంగా 80 పరుగులు సాధించాడు.
హెడ్తో కలిసి మిచెల్ మార్ష్ (39; 12 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా
పవర్ప్లేలో ఏకంగా 113 పరుగులు బాది ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అయితే ఈ క్రమంలో ఓపెనర్ హెడ్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పవర్ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. పవర్ప్లేలో హెడ్ ఎదుర్కొన్న 22 బంతుల్లో 73 పరుగులు చేశాడు.

పవర్ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ట్రావిస్ హెడ్ 73(22), పాల్ స్టిర్లింగ్ 67(25), కొలిన్ మన్రో 66(23), క్వింటన్ డికాక్ 64(24) టాప్-4లో ఉన్నారు. ఈ అందరిలో హెడ్యే తక్కువ బంతులు ఎదుర్కోవడం గమనార్హం. ఇక స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
ఓపెనర్ మున్సె (28; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో అబాట్ మూడు, జేవియర్, జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 62 బంతులు మిగిలుండగానే విజయాన్ని సాధించింది. అయితే ఈ క్రమంలో ఆస్ట్రేలియా మరో అరుదైన రికార్డు సాధించింది. టీ20ల్లో 150+ పరుగుల లక్ష్యాన్ని ఎక్కువ బంతుల మిగిలుండగా ఛేదించిన జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ సరసన నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్పై 166 పరుగుల టార్గెట్ను 62 బంతులు మిగిలుండగానే ఛేదించింది.