సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్ను కోల్పోయింది. అయితే ఓటమిపై స్పందిస్తూ పాకిస్థాన్ నయా కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ జట్టు పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక క్యాచ్లను జారవిడిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 147 పరుగులు చేసింది. మ్యాథ్యూ షార్ట్ (32; 17 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఆరోన్ హార్డీ (28; 23 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), గ్లెన్ మ్యాక్స్వెల్ (21; 20 బంతుల్లో, 2 ఫోర్లు), జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (20; 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) కీలక పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిష్ రవూఫ్ నాలుగు వికెట్లు, అబ్బాస్ అఫ్రిది మూడు, సుఫియాన్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 19.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (52; 38 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), ఇర్ఫాన్ ఖాన్ (37; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడారు. వీరిద్దరితో పాటు మహ్మద్ రిజ్వాన్ (16; 26 బంతుల్లో, 1 ఫోర్) మినహా మరే బ్యాటర్ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. స్పెన్సర జాన్సన్ అయిదు వికెట్లతో చెలరేగాడు. ఆడమ్ జంపా రెండు, జేవియర్ ఒక వికెట్ తీశారు.
అయితే ఆస్ట్రేలియా 147 కంటే ఇంకా తక్కువ స్కోరే చేసేది. కానీ పాకిస్థాన్ పేలవ ఫీల్డింగ్ పుణ్యమా ఆ స్కోరు చేసింది. మూడు కీలక క్యాచ్లను పాక్ ఫీల్డర్లు జారవిడిచారు. ''మా బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. కానీ కీలక క్యాచ్లను వదిలేశాం. తగిన మూల్యాన్నిచెల్లించుకున్నాం. ఆస్ట్రేలియా అంత తేలికైన జట్టు కాదని మాకు తెలుసు. ఇక ఈ పిచ్పై బ్యాటింగ్ అంత సులువు కాదని తెలుసు. ఈ పరిస్థితుల్లో క్యాచ్లు ఎంతో విలువైనవి'' అని మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. కాగా, హారిష్ రవూఫ్ గొప్పగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు.