టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ షోతో అదరగొట్టి తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆడమ్ జంపా (4/12) ధాటికి మొదట నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
నమీబియా జట్టులో ఇద్దరు మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జంపాతో పాటు హేజిల్వుడ్, స్టొయినిస్ చెరో రెండు, కమిన్స్, నాథన్ ఎలిస్ తలో వికెట్తో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా పలు రికార్డులు బద్దలుకొట్టింది. టీ20 వరల్డ్ కప్లో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. 86 బంతులు మిగిలుండగానే ఆసీస్ లక్ష్యాన్ని సాధించింది. కాగా, ఈ రికార్డు జాబితాలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2014 టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్పై లంక 90 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.ఇక మిగిలిన స్థానాల్లో ఆస్ట్రేలియా (82 బంతులు, బంగ్లాదేశ్పై-2021), భారత్ (81 బంతులు, స్కాట్లాండ్పై-2021), శ్రీలంక (77 బంతులు, నెదర్లాండ్స్పై 2021) ఉన్నాయి.
ఆస్ట్రేలియా మరో ఘనత సాధించిది. టీ20 వరల్డ్ కప్లో పవర్ప్లేలో ప్రత్యర్థిపై అత్యధిక ఆధిక్యాన్ని సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. ఇవాళ మ్యాచ్లో నమీబియా మొదటి ఆరు ఓవర్లలో 17/3 స్కోరుతో నిలిచింది. మరోవైపు ఆసీస్ 74/1 మెరుపు స్కోరు సాధించింది. ప్రత్యర్థి స్కోరు కంటే 57 పరుగులు ఎక్కువగా చేసింది. అంతకుముందు ఈ రికార్డు నమీబియా పేరిట ఉండేది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో నమీబియా పవర్ప్లేలో ప్రత్యర్థి కంటే 55 స్కోరు అధికంగా సాధించింది. 2021 వరల్డ్కప్లో జరిగిన ఈ పోరులో స్కాట్లాండ్ 27/2, నమీబియా 82/2 స్కోరు చేశాయి.