ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను ఆస్ట్రేలియా ఘనంగా బోణీకొట్టింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 23 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
సామ్ కరన్ వేసిన అయిదో ఓవర్లో ట్రావిస్ హెడ్ విజృంభించాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతుల్ని బౌండరీకి తరలించిన హెడ్ ఆ తర్వాత హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్, డీప్ పాయింట్ మీదగా బంతిని స్టాండ్స్కు తరలించాడు. ఆ ఓవర్లో చివరి బంతిని ఎక్సట్రా కవర్ మీదుగా ఫోర్ బాదాడు.

హెడ్తో పాటు మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ (41; 26 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ (37; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా రాణించారు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. హెడ్-షార్ట్ చెలరేగడంతో పవర్ప్లేలో 86 పరుగులు వచ్చాయి. అయితే ఆ క్రమంగా ఆసీస్ వికెట్లు కోల్పోయింది. లివింగ్స్టోన్ మూడు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 151 పరుగులకు కుప్పకూలింది. లివింగ్స్టోన్ (37; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఛేజింగ్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పవర్ప్లే ముగిసేసరికి 46 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే సామ్ కరన్ (18; 15 బంతుల్లో, 2 ఫోర్లు)-లివింగ్స్టోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు.
కానీ ఆసీస్ బౌలర్లు పుంజుకుని ఇంగ్లండ్కు అవకాశమివ్వలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో అబాట్ మూడు, హేజిల్వుడ్, జంపా చెరో రెండు వికెట్లు తీశారు. కార్డిఫ్ వేదికగా శుక్రవారం రెండో టీ20 జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టీ20లు, అయిదు వన్డేలు ఆడనుంది.