
హైదరాబాద్: ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ నియమింపబడ్డారు. 2019-20 సీజన్ కోసం ఎంపిక చేయబడిన ఈ కమిటిలో అతుల్ వాసన్తో పాటు అనిల్ భరద్వాజ్, వినీత్ జైన్లు ఉన్నారు.
2016లో వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి డీడీసీఏ యాజమాన్యానికి భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో అతుల్ వాసన్ను సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి మొట్టమొదట తొలగించారు. ఆ తర్వాత మళ్లీ 2017-18 సీజన్కు తిరిగి నియమింపబడ్డారు.
కాగా, జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా మయాంక్ తెహ్లాన్ను డీడీసీఏ ఎంపిక చేసింది. U-19/U-16/U-14 ఏజ్ గ్రూపులకు సంబంధించి ఆటగాళ్లను మయాంక్ తెహ్లాన్ ఎంపిక చేయనున్నారు. ముగ్గురు ఉన్న కమిటీలో మిగతా ఇద్దరు సభ్యులుగా చేతన్ శర్మ, ప్రదీప్ చావ్లాలు ఉన్నారు.
కాగా, ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా స్టేడియానికి దివంగత మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన జైట్లీ పేరును కోట్లా స్టేడియానికి పెట్టాలని నిర్ణయించినట్లు డీడీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
"అరుణ్ జైట్లీ ప్రోత్సాహం వల్లే కోహ్లి, సెహ్వాగ్, గంభీర్, నెహ్రా, పంత్ లాంటి భారత్ గర్వించే ఆటగాళ్లు వెలుగులోకొచ్చారు. అందుకే కోట్లాకు ఆయన పేరు పెడుతున్నాం" అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ చెప్పాడు. సెప్టెంబర్ 12న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఫిరోజ్షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు సైతం హాజరుకానున్నారు. కాగా, డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్కు సేవలందించారు. ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎక్కువ మంది అభిమానులు మ్యాచ్ని వీక్షించేందుకు వీలుగా కోట్లా స్టేడియం కెపాసిటీని సైతం అరుణ్ జైట్లీ పెంచారు.
దీంతో పాటు ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో కీలకంగా వ్యవహారించారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో వరల్డ్ క్లాస్ డ్రెస్సింగ్ రూమ్స్ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు.