న్యూఢిల్లీ: భారత క్రికెట్ స్టార్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం నాడు షాకయ్యాడు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో బీజేపీ నిరసన సందర్భంగా శక్తిమాన్ అనే గుర్రం గాయపడింది. దీని కాలు విరిగింది. దీంతో ఆ పోలీసు అశ్వ దళంలోని గుర్రం (శక్తిమాన్) అనే గుర్రానికి కృత్రిమ కాలు అమర్చారు.
ఈ విషయం తెలిసిన కోహ్లీ షాకయ్యాడు. ఈ ఘటన పైన అతను ఆవేదన, ఒకింత ఆవేశం వ్యక్తం చేశాడు. అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఈ ఘటనపై స్పందించాడు.
ఈ సంఘటన తనను షాక్కు గురి చేసిందని, అలాగే విచారం కలిగించిందని పేర్కొన్నాడు. హానీ చేయని, అందమైన జంతువును కొట్టడం బాధాకరమన్నాడు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని, మనమంతా శక్తిమాన్ కోసం ప్రార్థిద్దామని పేర్కొన్నాడు.
కాగా, ఉత్తరాఖండులో శక్తిమాన్ అనే గుర్రం గాయపడగా, దానికి కృత్రిమ కాలును అమర్చారు. కృత్రిమ కాలుపై గుర్రం లేచి నిలబడుతోందని ఆపరేషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు. ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ గుర్రం (శక్తిమాన్) ప్రాణాలు కాపాడేందుకు దాని కాలును తొలగించాలని సైనిక వైద్యులు గురువారం నిర్ణయించారు.
అలా చేయకుండా అలాగే ఉంచేస్తే గాంగరిన్ కారణంగా అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును శుక్రవారం ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ గుర్రాన్ని కర్రతో విచక్షణా రహితంగా కొట్టిన కేసులో ముస్సోరి బీజేపీ ఎమ్మెల్యే గణేశ్జోషిని డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు.