
కేసు నమోదు:
శనివారం మీరట్లోని ముల్తాన్ నగర్లో దీపక్ కుమార్ అనే వ్యక్తి తన కొడుకు స్కూల్ బస్సు దిగడానికి సహాయం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆ మార్గం గుండా వెళుతున్న ప్రవీణ్ కుమార్ కారుకు బస్సు అడ్డుగా ఉండడంతో.. అతను ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆపై దీపక్, అతని కొడుకుపై దాడి చేసాడు. ఇదే విషయం ఫిర్యాదులో పేర్కొన్నారని ఓ జాతీయ స్పోర్ట్స్ ఛానెల్ తన కథనంలో రాసుకొచ్చింది. ప్రవీణ్ కుమార్ ఫుల్లుగా తాగి తన పక్కింట్లో ఉండే వ్యక్తిని, అతడి కొడుకుని కొట్టాడని పిర్యాదు అందటంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వారే చేయి చేసుకున్నారు:
పక్కంటి వారిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. సోమవారం మాట్లాడుతూ... 'నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడూ కనీసం చీమకు కూడా హాని తలపెట్టను. అలాంటిది ఒక అబ్బాయిపై ఎందుకు దాడి చేస్తా. మా ఇంటికి సమీపంలో ఆ అబ్బాయి, అతని తండ్రి నాతో గొడవపడ్డారు. నేను కారులో ఉన్న సమయంలో వారిద్దరూ నన్ను బయటలాగి దాడి చేశారు' అని ప్రవీణ్ తెలిపాడు.

ఆ వార్తల్లో నిజం లేదు:
'నేను తాగి వారిని కొట్టాననడంలో నిజం లేదు. వారే నా చైన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. స్థానిక రాజకీయాలతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఇక్కడ ఉండను. నాకు అక్కడ రెండు మూడు ఇళ్లులు ఉన్నాయి. ఇక్కడ పెయింట్ పనులు ఎలా జరుగుతున్నాయనే చూద్దామని వచ్చా. ఇక్కడ కొంతమంది ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేరు. నా ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం ఇది. కొందరు ఉచిత ప్రచారంతో వార్తల్లో నిలవడం కోసం ఇలా చేస్తున్నారు' అని ప్రవీణ్ పేర్కొన్నాడు.

భారత్ తరఫున 112 వికెట్లు:
'నేను నా జీవితంలో సంతోషంగా ఉన్నాను. ఇటీవల ముగిసిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో వ్యాఖ్యానం చేశాను. రంజీ ట్రోఫీలో మళ్ళీ చేస్తాను' అని ప్రవీణ్ చెప్పారు. ప్రవీణ్ కుమార్ గతంలో కూడా తప్ప తాగి గొడవ పడిన సంఘటనలు ఉన్నాయి. కెరీర్ మొదట్లో ఆకట్టుకున్న ప్రవీణ్.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి టీమిండియాలో స్థానం కోల్పోయాడు. భారత్ తరఫున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడిన ప్రవీణ్.. 112 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications












