కోల్కత్తా: గాయపడిన బెంగాల్ క్రికెటర్ రాహుల్ ఘోష్ తల్లి సోమవారం అండర్ 19 కెప్టెన్ అంకిత్ కేసరి మరణవార్త తనను ఎంతో బాధించిందని, తన కుమారుడిని మంగళవారం మైదానంలో జాగ్రత్తగా ఉండమని కోరినట్లు చెప్పారు.
అంకిత్ మరణవార్త మా అందరిని ఎంతో భయపెట్టిందని, మంగళవారం రాహుల్ను ఆడొద్దని చెప్పానని తెలిపారు. అయినా సరే రాహుల్ నా మాట వినకుండా మైదానంలోకి దిగాడు. మ్యాచ్కు ముందు కూడా ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని అన్నారు. అయినా సరే నా మాట వినకుండా మ్యాచ్లో ఆడాడు. నా మాట విని, ఈ మ్యాచ్లో ఆడకుండా ఉండివుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని అన్నారు. భగవంతుడిని ప్రార్ధించడం తప్ప ఇప్పుడేం చేయోలో అర్ధం కావడం లేదని చెప్పారు.
బ్యాట్స్మన్ కొట్టిన బంతి తలకు తగలడంతో రాహుల్ ఘోష్ (19) తీవ్రంగా గాయపడ్డాడు. వీడియోకాన్ క్రికెట్ అకాడమీ వేదికగా విజయ్ స్పోర్టింగ్, కోల్కతా పోలీస్ జట్ల మధ్య మంగళవారం జరిగిన బెంగాల్ క్రికెట్ సంఘం సెకండ్ డివిజన్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది.

రాహుల్ కోల్కతా పోలీస్ జట్టుకు ఆడుతున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్మన్ బలంగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ గాయపడ్డాడు. బంతి బౌన్స్ అయి అతని తలకు ఎడమ భాగంలో బలంగా తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతను మైదానంలోనే కుప్పకూలాడు.
వెంటనే అతడిని నైటింగేల్ ఆసుపత్రికి తరలించారు. అంకిత్ ప్రాణాలు విడిచిన ఆసుపత్రిలోనే అతను ప్రాణాలతో పోరాడుతున్నాడు. 'రాహుల్ తలకు ఎడమ పక్క తీవ్ర గాయమైంది. చాలా రక్తం పోయింది. సీటీ స్కాన్లో గాయమైన చో ట రక్తం గడ్డ కట్టినట్టు కనబడుతోంది. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే వారంపాటు అతణ్ని పరిశీలనలో ఉంచాల'ని రాహుల్కు చికిత్స చేస్తున్న వైద్యుడు చెప్పారు.
రాహుల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల రాహుల్ తరచూ స్పృహ కోల్పోతున్నట్టు తెలుస్తోంది. అతను తన కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేకపోతున్నాడని చెబుతున్నారు.