టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అత్యంత చిన్న వయసులో టీ20 ఫార్మాట్ లో శతకం సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో భారత క్రికెట్ టీమ్ చెలరేగింది. నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జైస్వాల్ శతకంతో చెలరేగాడు. కేవలం 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో వంద పరుగులు చేశాడు.
ఈ మ్యాచులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (25), రింకూ సింగ్ (37 నాటవుట్), శివం దూబే (25 నాటవుట్) కూడా రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసిన టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సెంచరీతో చెలరేగిన జైస్వాల్ పై కూడా ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే టీమిండియా ఫ్యూచర్ అంటూ మెచ్చుకుంటున్నారు. గిల్, జైస్వాల్ తో భారత బ్యాటింగ్ భవిషత్తు చాలా భద్రంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా గేమ్స్ వంటి కీ టోర్నీలో జైస్వాల్ సెంచరీ చేయడం చాలా గొప్ప విషయం అని అంటున్నారు. ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ తమదే అని భారత ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్వార్టర్స్ మ్యాచులో నేపాల్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో ఫ్యాన్స్ మెడల్ ఆశలు మరింత పెరిగాయి. ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ టీమ్ కచ్చితంగా గోల్డ్ మెడల్ కొడుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వారికి జైస్వాల్ వంటి ప్రదర్శనలు మరింత ఊతం ఇస్తున్నాయి.
ఆసియా క్రీడల్లో టాప్ 8లో ఉన్న భారత్.. నేరుగా క్వార్టర్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచులో భారీ స్కోర్ చేయడం కచ్చితంగా జట్టు కాన్ఫిడెన్స్ ను పెంచడం ఖాయం. యువ కెప్టెన్ రుతురాజ్ పై కూడా దీని వల్ల ప్రెషర్ తగ్గుతుంది.