చైనాలోని హాంగ్ జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ టీం శుభారంభం చేసింది. నేపాల్తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ ఏడాది తొలిసారి ఆసియా క్రీడల్లో భాగంగా క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ తొలి మ్యాచులో నేపాల్తో భారత్ తలపడింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (100) సెంచరీతో చెలరేగాడు. అతనితోపాటు మిగతా బ్యాటర్లు కూడా తలా ఒక చెయ్యి వేయడంతో భారత జట్టు కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగుల స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ కూడా గట్టిపోటీ ఇచ్చింది. నేపాల్ బ్యాటర్లు దాదాపు అందరూ ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అయితే వేగంగా పరుగులు చేయడంలో ఆ టీం తడబడింది. అదే సమయంలో రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకోగా.. సాయి కిషోర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నేపాల్ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 179 పరుగులే చేయగలిగింది. భారత జట్టు 23 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో నెగ్గి ఆసియా క్రీడల్లో సెమీఫైనల్స్ చేరుకుంది.
మిగతా క్రీడల్లో కూడా భారత ఆటగాళ్లు రాణించారు. ముఖ్యంగా భారత కబడ్డీ జట్టు చెలరేగింది. ఏడుసార్లు ఆసియా క్రీడల్లో ఛాంపియన్గా నిలిచిన ఈ టీం.. ఆసియాడ్లో తమ తొలి మ్యాచులోనే 37 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ను ఈ మ్యాచులో భారత్ ఏకంగా ఎనిమిది సార్లు ఆలౌట్ చేయడం గమనార్హం. వీటిలో ఆరుసార్లు సెకండ్ హాఫ్లో జరగడం విశేషం.
అలాగే భారత కానోయింగ్ జోడీ అర్జున్ సింగ్, సునీల్ సింగ్ పతకంతో మెరిశారు. పురుషుల డబుల్స్ వెయ్యి మీటర్ల కానోయింగ్ను వీళ్లిద్దరూ 3:53.229 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. వీరు దక్కించుకున్న కాంస్య పతకం.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు కానోయింగ్లో దక్కిన రెండో మెడల్ మాత్రమే కావడం గమనార్హం.
భారత హాకీ అమ్మాయిలు కూడా చెలరేగారు. తమ చివరి పూల్-ఏ గేమ్లో హాంగ్కాంగ్ను ఏకంగా 13-0 తేడాతో క్లీన్ స్వీప్ చేశారు. ఈ టోర్నీలో నాలుగు గ్రూప్ మ్యాచులు ఆడిన భారత అమ్మాయిలు 33 గోల్స్ చేశారు. అదే సమయంలో కేవలం ఒక్క గోల్ మాత్రమే ఇచ్చారు. అదే సమయంలో భారత ఆర్చర్ జ్యోతి సురేఖ (27) కూడా ముందంజ వేసింది. సెమీస్లో మరో భారతీయ ఆర్చర్ను ఓడించి ఫైనల్ చేరుకుంది.
పురుష ఆర్చర్ ఓజాస్ ప్రవీణ్ అయితే ఆసియాడ్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. క్వార్టర్స్లో 150/150 పర్ఫెక్ట్ స్కోరు చేసిన అతను.. సెమీస్లో కూడా అదే ప్రదర్శన చేసి ఫైనల్ చేరుకున్నాడు. భారత పురుషుల బ్రిడ్జ్ టీం కూడా సెమీఫైనల్స్ చేరుకోవడం గమనార్హం.