చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ టీం చెలరేగుతోంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో నేపాల్పై ఘన విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టిన భారత జట్టు.. సెమీఫైనల్ లో కూడా అదరగొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఈ మ్యాచులో ఘనవిజయం సాధించింది.
హాంగ్ జో వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని బౌలర్లు నిరూపించుకున్నారు. టీమిండియా స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, సాయి కిషోర్, రవి బిష్ణోయి అందరూ రాణించారు.

సాయి కిషోర్ మూడు వికెట్లతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బిష్ణోయి, అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ, షాదాబ్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో బంగ్లా జట్టు ఏ దశలోనూ మంచి స్కోరు చేసేలా కనిపించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి బంగ్లా టీం 96 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెన్ యశస్వి జైస్వాల్ (0) విఫలమయ్యాడు. కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 40 నాటౌట్), తిలక్ వర్మ (26 బంతుల్లో 55 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరేగారు.
వీళ్లిద్దరూ చెలరేగడంతో భారత జట్టు కేవలం 9.2 ఓవర్లలోనే 97 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు.. ఆసియా క్రీడల్లో ఫైనల్ కు చేరుకుంది. మరికొద్ది సేపట్లో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఈ రెండింట్లో గెలిచిన జట్టు.. ఫైనల్ లో భారత్ ను ఢీకొంటుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఆఫ్గనిస్తాన్ పై పాక్ గెలవాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఫైనల్ లో భారత్, పాక్ మ్యాచ్ చూడొచ్చని అభిమానులు ఆశ పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
చిన్నతనంలో బ్యాటు, బాలు పట్టుకున్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలని అనుకునే ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకటే కోరిక ఉంటుంది. ఎప్పటికైనా అత్యున్నత స్థాయిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, కానీ ఆ ఆశ అందరికీ తీరదు. చాలా మంది కనీసం రాష్ట్ర స్థాయి మ్యాచులు కూడా ఆడకుండానే రిటైర్ అయిపోతారు. అందుకే భారత జెర్సీ వేసుకునే అవకాశం వస్తే ఆటగాళ్ల కళ్లలో కనపడే ఆనందమే వేరు.
చైనాలోని హాంగ్జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో అలాంటి దృశ్యాలే అందరికీ కనిపించాయి. నేపాల్తో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు జర్నీ మొదలైంది. కుర్రాళ్లతో కూడిన ఈ జట్టులో ఎడం చేతి వాటం స్పిన్నర్ రవిశ్రీనివాన్ సాయి కిషోర్కు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ 26 ఏళ్ల స్పిన్నర్ ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు.

జాతీయ గీతాలాపన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనైన అతను కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. అదే సమయంలో సాయి కిషోర్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ట్యాలెంట్ ఉంటే ఎప్పటికైనా కల నెరవేరుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినా కూడా అతనికి ఒక్క మ్యాచులో కూడా అవకాశం దక్కలేదు.
అయితే 2022 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ అతన్ని సొంతంచేసుకుంది. దీంతో అతని ట్యాలెంట్కు గుర్తింపు దక్కింది. పొట్టి ఫార్మాట్లో సాయికి చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 49 టీ20ల్లో 16.91 సగటు, 5.48 ఎకానమీతో అతను 57 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. ఇప్పుడు ఎట్టకేలకు చైనా గడ్డపై టీమిండియా జెర్సీ ధరించాడు. అందుకే అంత ఎమోషనల్ అయిపోయాడు.