చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ టీం కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ వంటి యువ స్టార్లతో కూడిన ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్లో లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో గైక్వాడ్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
దీంతో గైక్వాడ్ కూడా ధోనీ తరహా కెప్టెన్సీ స్కిల్స్ చూపిస్తాడని అంతా ఆశిస్తున్నారు. అయితే గైక్వాడ్ మాత్రం తను అలా చేయబోనని, తనలా ఉండటానికే ప్రయత్నిస్తానని చెప్పాడు. ధోనీతో గైక్వాడ్కు మంచి బాండింగ్ ఉంది. అందుకే అందరూ అతన్ని ధోనీతో పోల్చుతూ మాట్లాడుతున్నారు. దీనికి అంగీకరించిన గైక్వాడ్.. ధోనీ నుంచి కొన్ని నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని ఒప్పుకున్నాడు.

'నేను ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్న మాట వాస్తవమే. అయితే ప్రతి మనిషీ వేరు వేరుగా ఆలోచిస్తాడు. వాళ్ల స్టైల్ కూడా వేరుగానే ఉంటుంది. నా పర్సనాలిటీకి, ధోనీ పర్సనాలిటీకి చాలా తేడా ఉంది. నేను నాలా ఉండటానికే ప్రయత్నిస్తా. మామూలుగా ధోనీ ఏం చేస్తుంటాడో నేను పట్టించుకోను కూడా' అని చెప్పాడు.
అయితే ధోనీ నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుందని రుతురాజ్ అంగీకరించాడు. 'మనం కలిసి ఆడుతున్నప్పుడు ధోనీ నుంచి కొన్ని విషయాలు కచ్చితంగా నేర్చుకోవాలి. పరిస్థితులను ధోనీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? మ్యాచులో కొందరు ఆటగాళ్లను ధోనీ ఎలా మేనేజ్ చేస్తాడు? ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది' అని రుతురాజ్ అన్నాడు.
'నా ప్లేయర్లు తమను తాము ఎక్స్ప్రెస్ చేయాలనేదే నా ఆలోచన. వాళ్లకు మ్యాచులో సాధ్యమైనంత ఫ్రీడమ్ ఇవ్వాలనే అనుకుంటున్నా' అని చెప్పాడు. ఈ ఆసియా గేమ్స్లో భారత జట్టును ముందుండి నడిపించడం నిజంగా తనకు దక్కిన అదృష్టం అని చెప్పాడు.