
సియోల్: భారత మహిళా హాకీ జట్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ ప్రాణాంతక మహమ్మారి జట్టు ప్లేయర్కు సోకింది. డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాతో ఇవ్వాళ మ్యాచ్ జరగాల్సిన కొన్ని క్షణాల ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో మ్యాచ్ను రద్దయింది. ఈ విషయాన్ని ఆసియన్ హాకీ ఫెడరేషన్ ధృవీకరించింది. టీమిండియా విమెన్ హాకీ ప్లేయర్కు కరోనా వైరస్ సోకిందని తెలిపింది. దక్షిణ కొరియాతో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మహిళల హాకీ ఆసియన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు దక్షిణ కొరియా ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఆడటానికి భారత జట్టు దక్షిణ కొరియాకు వెళ్లింది. టోర్నమెంట్లో భాగంగా దక్షిణ కొరియా జట్టుతో తలపడాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఈ ఉదయం 11:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. టీమిండియాకు ఇది రెండో మ్యాచ్. తన తొలి మ్యాచ్లో థాయ్లాండ్ను చిత్తు చేసింది. 13-0 గోల్స్ తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించింది.
గుర్జీత్ కౌర్ అయిదు గోల్స్ కొట్టారు. దక్షిణ కొరియా ఓటమితో ఈ టోర్నమెంట్ను ఆరంభించింది. తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్లో జపాన్ చేతిలో ఓడిపోయింది. 1-0 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియాను ఓడించింది జపాన్. రెండో మ్యాచ్లో భారత జట్టును ఎదుర్కొనాల్సి ఉండగా.. అనూహ్యంగా రద్దయింది. చివరి నిమిషంలో మ్యాచ్ రద్దయింది. కరోనా వైరస్ సోకడం వల్ల ఈ టోర్నమెంట్లో రద్దయిన రెండో మ్యాచ్ కూడా ఇదే.
ఇదివరకు మలేసియా హాకీ ప్లేయర్కు కరోనా సోకింది. స్టార్ ప్లేయర్ నూరుల్ ఫయిజా షఫిఖా ఖలీంకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆ జట్టు తొలి రెండు మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం మలేసియా హాకీ జట్టు ప్లేయర్లందరూ క్వారంటైన్లో ఉంటోన్నారు. ఇదే తరహాలో భారత హాకీ జట్టు కూడా క్వారంటైన్కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. దక్షిణ కొరియా ప్రభుత్వం అమలు చేస్తోన్న కరోనా వైరస్ ప్రొటోకాల్స్కు అనుగుణంగా క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది.
క్వారంటైన్ కాలం ముగిసిన తరువాతే మిగిలిన మ్యాచ్లను ఆడాల్సిన పరిస్థితి ఎదురు కావొచ్చు. నిజానికి- గత సంవత్సరమే ఈ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ఈ టోర్నమెంట్ను ఈ ఏడాదికి వాయిదా వేశారు. అయినప్పటికీ.. కరోనా వైరస్ రెండు జట్ల ప్లేయర్లకు సోకింది. భారత మహిళా జట్టులో ఎవరికి ఈ వైరస్ సోకిందనేది ఇంకా తెలియరాలేదు.